Share News

జీజీహెచ్‌లో ప్రధానమంత్రి దివ్యాంగ కేంద్రం

ABN , Publish Date - Jun 22 , 2026 | 10:38 PM

సాంఘిక సంక్షేమ, దివ్యాంగ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి,ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చొరవతో ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రధానమంత్రి దివ్యాంగ కేంద్రం(పీఎండీవీకే) ఏర్పాటు కానుంది.

జీజీహెచ్‌లో ప్రధానమంత్రి దివ్యాంగ కేంద్రం
మంత్రిని కలిసిన ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ నామినేని

అనువైన స్థలం పరిశీలన పూర్తి

ఉన్నతాధికారులకు నివేదిక

దివ్యాంగులకు అందుబాటులోకి కృత్రిమ అవయవాలు, సహాయక పరికరాలు తదితర సేవలు

మంత్రి స్వామి, ఎమ్మెల్యే జనార్దన్‌కు వివరించిన రిమ్స్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌

ఒంగోలు కార్పొరేషన్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : సాంఘిక సంక్షేమ, దివ్యాంగ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి,ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చొరవతో ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రధానమంత్రి దివ్యాంగ కేంద్రం(పీఎండీవీకే) ఏర్పాటు కానుంది. రాష్ట్రానికి ఆరు కేంద్రాలు మంజూరు కాగా అందులో ఒకటి ఒంగోలులో ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థల పరిశీలన, ఇతర మౌలిక వసతులపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌ మంత్రి స్వామిని, ఎమ్మెల్యే దామచర్లను వేర్వేరుగా కలిసి కేంద్రం ఏర్పాటు వివరాలను తెలిపారు. అనువైన స్థలాన్ని కూడా పరిశీలించి అధికారులకు నివేదికలు పంపామని వివరించారు. జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, సహాయక పరికరాలు, పునరావాస సేవలు, ఇతర మద్దతు సౌకర్యాలు ఒకేచోట సులభంగా అందించడం ఈ ప్రధానమంత్రి దివ్యాంగ కేంద్రం లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి వైద్యులతో మాట్లాడుతూ జీజీహెచ్‌ వైద్యులు, దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఒంగోలులో పీఎండీవీకే ఏర్పాటు కావడం శుభపరిణామం అని, దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాల తయారీతో జిల్లాలోని దివ్యాంగులకు మరింత ప్రయోజనకరం అన్నారు.


జీజీహెచ్‌లో స్థల పరిశీలన

మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు పీఎండీవీకే స్థల పరిశీలనకు ప్రత్యేక బృందం జీజీహెచ్‌కు విచ్చేసింది. ఆర్ఫిఇసియల్‌ లింబ్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులతో కూడిన ఉమ్మడి బృందం పీఎండీవీకే ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ సువార్తమ్మ, ఏఎల్‌ఐఎంసీఓ ప్రతినిధి రాజబాబు, సీఎ్‌సఆర్‌ఎంఓ డాక్టర్‌ మాధవీలత, ఏపీఎ్‌సఎంఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 10:38 PM