శ్మశానంలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:00 PM
బాలసదన్లో నివాసం ఉంటూ చదువుకుంటూ చనిపోయిన మౌనిక(11) బాలిక మృతదేహాన్ని శ్మశానంలో తవ్వి తీసి గురువారం పోస్టుమార్టం చేశారు.
ఈనెల 7న కేసు నమోదు చేసిన పోలీసులు
ఖననం చేసిన మృతదేహాన్ని తవ్వి తీసిన అధికారులు
ఒంగోలు క్రైం, మార్చి12 (ఆంధ్రజ్యోతి) : బాలసదన్లో నివాసం ఉంటూ చదువుకుంటూ చనిపోయిన మౌనిక(11) బాలిక మృతదేహాన్ని శ్మశానంలో తవ్వి తీసి గురువారం పోస్టుమార్టం చేశారు. తన మనమరాలు మృతి కారణం ఏమిటి అంటూ మౌనిక అమ్మమ్మ గంగ ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఈ నెల 7 ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం స్థానిక హిందు శ్మశాన వాటికలో పూడ్చివేసిన మృతదేహాన్ని బయిటకు తీసి ఫోరిన్సిక్ డాక్టర్ల బృందం పోస్టుమార్టం చేసింది. బాలసదన్లో ఉంటూ చదువుకుంటున్న మౌనిక అనారోగ్యం పాలుకావడంతో రిమ్స్లో జనవరి 19న చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేనెల 24న మృతి చెందింది. అప్పట్లో ఎలాంటి కేసు నమోదు చేయకుండా, పోస్టుమార్టం చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మౌనిక మృతదేహాన్ని ఖననం చేశారు. మౌనిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఒంగోలు అర్బన్ తహసీల్దార్ మధుసూదనరావు, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు సమక్షంలో డాక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, ఈబీ పవన్, వి.సాయిజయకృష్ణలు పోస్టుమార్టం నిర్వహించారు.