కొత్త జేసీకి పాత సమస్యలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:07 PM
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పి. శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టిన తరువాత సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఎప్పటిలాగానే రెవెన్యూ సమస్యలపై అధికంగా అర్జీలు పట్టుకుని ప్రజలు హాజరయ్యారు.
మీకోసంకు 168 అర్జీలు
అందులో 92 రెవెన్యూవే
మార్కాపురం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పి. శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టిన తరువాత సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఎప్పటిలాగానే రెవెన్యూ సమస్యలపై అధికంగా అర్జీలు పట్టుకుని ప్రజలు హాజరయ్యారు. పలుమార్లు సమస్యల పరిష్కా రం కోసం వస్తూనే ఉన్నామని కొత్తగా వచ్చిన జేసీ దృష్టికి మరోసారి తమ సమస్యను తీసుకువస్తున్నామని కొందరు చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి రెవెన్యూ క్లినిక్ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని మండలాల తహసీల్దార్లు, సిబ్బంది అక్కడ ఉన్నారు. వారి పరిధిలో సమాధానం చెప్తున్న సమస్యలు కూడా జేసీ వరకు మేము వెళ్లాల్సిందే అని కొందరు నేరుగా జేసీ శ్రీనివాసులు వద్దకు తమ ఫిర్యాదులు తీసుకెళ్లారు. మొత్తం 168 ఫిర్యాదులు వస్తే అందులో 92 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం విశేషం. మిగిలిన 76 అర్జీలు నివేశన స్థలాలు, పింఛన్లు, వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవి. మీకోసం కార్యక్రమంలో జేసీతో పాటు ఇన్చార్జి డీఆర్వో ఓబులేసు, కనిగిరి, మార్కాపురం ఆర్డీవోలు కేశవర్ధన్రెడ్డి, శివరామిరెడ్డి, ఎస్డీసీ సత్యనారాయణ పాల్గొన్నారు.