ఓరొయ్యో!
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:24 AM
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రొయ్య రైతులు వణికిపోతున్నారు. ఆక్వా రంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారం రోజులుగా ధరలు దిగజారిపోతున్నాయి.
ఆక్వాకు ఇరాన్ యుద్ధం దెబ్బ
నిలిచిన ఎగుమతులు
కౌంటుకు రూ.40 తగ్గిన ధరలు
ఇంకా పడిపోయే అవకాశం
ఆందోళనలో ఆక్వా రైతులు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రొయ్య రైతులు వణికిపోతున్నారు. ఆక్వా రంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వారం రోజులుగా ధరలు దిగజారిపోతున్నాయి. కౌంటు (కేజీ)కి ఏకంగా రూ.40దాకా తగ్గిపోయాయి. రొయ్యల ఎగుమతులు మందగించాయి. జిల్లాలో ఎక్కువగా రైతులు సాగు చేసే టైగర్ రకం రొయ్య 80శాతం గల్ఫ్ దేశాలకే వెళ్తుంది. యుద్ధం ప్రభావం ఆ దేశాలపై ఉండటంతో ధరలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఇవి మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒంగోలు నగరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం తీవ్రంగా పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు ఇంకా పతనమై భారీగా నష్టపోవాల్సి వస్తుం దని రైతులు ఆందోళన చెందుతు న్నారు. జిల్లాలో ఎక్కువ మంది ప్రస్తుతం టైగర్ రకం రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుం టాయి. యుద్ధం నేపథ్యంలో ఆ దేశా లకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర దేశాలపై కూడా పరోక్షంగా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. దీంతో వాటికి కూడా ఎగుమతులు మందగించాయి. ఈ పరిణామాలతో వ్యాపారులు ధరలు తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. 30 కౌంటు రొయ్యల ధర మూడురోజుల క్రితం రూ.510 ఉండగా ఇప్పుడు రూ.470కి పడిపోయింది. 40 కౌంటు రూ.410 ఉండగా రూ.370కి దిగజా రింది. 100 కౌంటు రూ.275 ఉండగా వ్యాపారులు ఇప్పుడు రూ.250కి కొను గోలు చేస్తున్నారు. యుద్ధం కొనసా గితే ఈ ధరలు మరింత పతనమ య్యే అవకాశం ఉందని భావిస్తు న్నారు. జిల్లాలో 12,500 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఇందులో 80శాతం టైగర్ రకమే ఉంది. ధరలు దిగజారడంతో రైతులు నష్టపోతు న్నారు. వేసవిలో రొయ్యలు చేతికొచ్చే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుం దోనని కలవరం చెందుతున్నారు. ప్రస్తుతం రెండు నెలల క్రితం సీడ్ వదిలిన రొయ్యల చెరువుల్లో వ్యాధుల కారణంగా కొంతభాగం తుడిచిపెట్టు కుపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటుండగా యుద్ధం ప్రభావంతో ధరలు పడిపోతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
పెట్టుబడులు పెరిగే అవకాశం
ఆక్వా రైతులకు ఇప్పటికే పెట్టుబడి ఖర్చు తడిసిమోపెడ వుతోంది. యుద్ధం కారణంగా సీడ్, ఫీడ్, చెరువుల్లో వాడే ఇతర కెమికల్స్ ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా సాగుకు అవసరమైన పెట్టుబడులు పెరగనున్నాయి. తీరా రొయ్యల పంట చేతికొచ్చే సమయానికి ధరలు మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆక్వా సాగుపై ముందుకు కదలాలా లేక విరమించుకోవాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు.