అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:32 PM
జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ ఎం.విజయసునీత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
కలెక్టర్ విజయసునీత
ఎండను లెక్కచేయకుండా బారులుతీరిన అర్జీదారులు
రెవెన్యూ సమస్యలపై ఆగని ఫిర్యాదులు
మార్కాపురం కలెక్టరేట్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ ఎం.విజయసునీత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులకు స్పష్టమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జిల్లా నుంచి వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలతో బారులు తీరారు. గత కొన్ని రోజులుగా ఉదయం 8 గంటలకు జరిగిన మీకోసం సోమవారం నుంచి 10 గంటలకు మార్చారు. అయితే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు వచ్చి అధికారులకు విన్నపాలు వినిపించుకున్నారు. ఈసారి కూడా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు రావడం విశేషం. మొత్తం 213 దరఖాస్తులు రాగా, వాటిలో 135 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, డీఆర్వో శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీవో అజయ్కుమార్, మార్కాపురం ఇన్చార్జి ఆర్డీవో సత్యనారాయణ జిల్లా అధికారులు పాల్గొన్నారు.