ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:22 PM
ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు స్పష్టంచేశారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన కలెక్టర్
గర్భిణులు, బాలింతలతో మాట్లాడి రాలు తెలుసుకున్న కలెక్టర్
ఒంగోలు కలెక్టరేట్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు స్పష్టంచేశారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో గురువారంరాత్రి జరిగిన పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ముందుగా గ్రామంలో ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, ఆర్డీవో చంద్రశేఖర్నాయుడుతో కలిసి గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. గ్రామ స్థితిగతులను ఈ సందర్భంగా ప్రజలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ గర్భిణులు, బాలింతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలపై కలెక్టర్ ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ ఆయా సమస్యలపై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పరిస్థితులపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు టంగుటూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయా శాఖల అధికారులు పర్యటించి ఆ గ్రామంలోని సమస్యలను తెలుసుకొని కలెక్టర్కు నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు బి. చిరంజీవి, ఎం. వెంకటేశ్వరరావు, అనుపమ పాల్గొన్నారు.