మార్కాపురం కలెక్టరేట్కు భద్రత కరువు
ABN , Publish Date - May 13 , 2026 | 03:08 AM
మార్కాపురం జిల్లా ఏర్పాటవగానే పట్టణానికి 4కి.మీ దూరంలో ఉన్న పునరావసకాలనీలోని పాఠశాల భవనాన్ని కలెక్టరేట్గా మార్చారు. ఐదు నెలలుగా భవనాన్ని వివిధ హంగులతో మార్పులు చేయడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
మొన్నటివరకు ఏఆర్ కానిస్టేబుళ్లతో పహారా
నేడు హోంగార్డులతో పర్యవేక్షణ
మార్కాపురం కలెక్టరేట్, మే 12 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా ఏర్పాటవగానే పట్టణానికి 4కి.మీ దూరంలో ఉన్న పునరావసకాలనీలోని పాఠశాల భవనాన్ని కలెక్టరేట్గా మార్చారు. ఐదు నెలలుగా భవనాన్ని వివిధ హంగులతో మార్పులు చేయడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా కార్యాలయంలో విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించిన రికార్డులు కూడా ఒంగోలు నుంచి ఇక్కడకు తరలించారు. ప్రారంభం నుంచి ఇక్కడ ఏఆర్ కానిస్టేబుళ్లతో సెంట్రీని ఏర్పాటు చేశారు. వారం క్రితం ఏఆర్ కానిస్టేబుళ్లను తొలగించి వారి స్థానంలో ముగ్గురు హోంగార్డులను షిఫ్ట్లవారీగా నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న కార్యాలయ భద్రతకు కనీసం వాచ్మన్ను కూడా నియమించకపొగా హోంగార్డులతో పర్యవేక్షణ ఏంటని పలువురు పెదవివిరుస్తున్నారు. కలెక్టరేట్ నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుంటున్న తరుణంలో సెక్యూరిటీపై అధికారులు దృష్టి సారించకపోవడం బాధాకరం. కనీసం పెట్రోలింగ్ పోలీసులు కూడా అటువైపు వెళ్తున్న దాఖలాలు లేవు. అధికారులు కలెక్టరేట్ భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది.