రాగిజావలో బల్లి
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:01 AM
విద్యార్థులకు ఇచ్చే రాగిజావలో బల్లిపడింది. నలుగురికి జావ ఇచ్చిన వెంటనే గుర్తించిన ఉపాధ్యాయురాలు దాన్ని పారబోయించారు. విద్యార్థులను కొండపిలోని సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10.30 ప్రాంతంలో కె. ఉప్పలపాడు గ్రామ పంచాయతీలోని దేవిరెడ్డిపాలెం ఎంపీ స్కూల్లో చోటుచేసుకుంది.
నలుగురు విద్యార్థులకు ఇచ్చిన తర్వాత గుర్తించిన ఉపాధ్యాయురాలు
ముందు జాగ్రత్తగా వైద్యశాలకు తరలింపు
ఆరోగ్యంగానే విద్యార్థులు
కొండపి, ఆగస్టు4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఇచ్చే రాగిజావలో బల్లిపడింది. నలుగురికి జావ ఇచ్చిన వెంటనే గుర్తించిన ఉపాధ్యాయురాలు దాన్ని పారబోయించారు. విద్యార్థులను కొండపిలోని సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10.30 ప్రాంతంలో కె. ఉప్పలపాడు గ్రామ పంచాయతీలోని దేవిరెడ్డిపాలెం ఎంపీ స్కూల్లో చోటుచేసుకుంది. స్కూల్లో యథావిధిగా రాగిజా వను తయారు చేసిన వంట వండే మహిళ జావతో పాత్రను సిద్ధం చేసింది. దాన్ని చల్లార్చేం దుకు పైమూతను తొలగించింది. ఈసమయంలో జావలో బల్లి పడింది. అది గమనించని వంట మహిళ నలుగురు విద్యార్థులకు జావ ఇచ్చింది. ఆతర్వాత బల్లి కనిపించడంతో కంగారుపడిన ఆమె ఉపాధ్యాయురాలు శ్రీవేణికి తెలియజేయడంతో నలుగురు తాగిన జావను వెంటనే కక్కించారు. సమాచారం ఉన్నతాధికారులకు తెలియజేసి వారి సూచనలతో కొండపి సీహెచ్సీకి విద్యార్థులను తరలించారు. స్కూల్కు చెందిన ఎస్.మహేంద్ర (1వ తరగతి), జె.గ్లోరీ (2వ తరగతి), ఎస్.మహిమ (4వ తరగతి), పి. ధనుష్ (5వ తరగతి) తాగారు.
డీఎంహెచ్వో, డిప్యూటీ ఈవో పరామర్శ...
విషయం తెలుసుకున్న డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో రంగయ్య వెంటనే కొండపి సీహెచ్సీకి వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. వారితో మాట్లాడారు. అనంతరం స్కూల్, వంట గదిని పరిశీలించారు. ఘటనపై ఉపాధ్యాయురాలు, వంటమనిషి, విద్యార్థులతో మాట్లాడారు. వీరితోపాటు కొండపి తహసీల్దార్ ఎస్.శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీనివాసరావు, ఎంఈవోలు కె.సురేఖ, బడే కోటిరెడ్డి విద్యార్థులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసాయంపై వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని, బుధవారం ఉదయం వరకు అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యాధికారి, ఎంఈవోలు తెలిపారు.