పండుగలా..
ABN , Publish Date - May 07 , 2026 | 02:37 AM
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియో జకవర్గ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ బుధవారం పండుగ వాతావరణంలో జరిగింది. నగరంలోని భాగ్యనగర్ నుంచి పాతబైపాస్కు వెళ్లే దారిలో లీజు ప్రాతిప దికన రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం పార్టీ కార్యాలయం కోసం కేటాయించింది.
ఒంగోలులో టీడీపీ కార్యాలయానికి భూమిపూజ
పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర సారథ్యంలో ఉత్సాహంగా కార్యక్రమం
మంత్రి డాక్టర్ స్వామితో సహా ప్రజాప్రతినిధులు హాజరు
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన శ్రేణులు
ఒంగోలు, మే 6 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియో జకవర్గ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ బుధవారం పండుగ వాతావరణంలో జరిగింది. నగరంలోని భాగ్యనగర్ నుంచి పాతబైపాస్కు వెళ్లే దారిలో లీజు ప్రాతిప దికన రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం పార్టీ కార్యాలయం కోసం కేటాయించింది. గత గురువారం ఇందుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఆ వెంటనే కార్యాలయ నిర్మా ణానికి అధిష్ఠానం ఆదేశించింది. పార్టీ ఒంగో లు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో చర్యలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల నుంచి అక్కడ భూమి చదును, జంగిల్ క్లియ రెన్స్, ఇతర విద్యుత్ సౌకర్యం ఇతరత్రా పనులు జరుగుతుండగా బుధవారం భూమి పూజ చేశారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు డాక్టర ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో కార్యక్ర మం ఉత్సాహంగా సాగింది. జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఇంటూరి నాగేశ్వ రరావు, ఎంఎంకొండయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు హాజరై పూజలు చేశారు. టీడీపీ నియోజవర్గ ఇన్చార్జిలు గుడూరి ఎరిక్షన్బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డీసీసీబీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్యచౌదరి, పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావులతోపాటు పలువురు జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ.3కోట్ల వ్యయంతో రెండంతస్థులు
సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థుల్లో కార్యాలయ భవన నిర్మాణాన్ని నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర, దామచర్ల జనార్దన్ విలేకరులకు తెలిపారు. పూర్తిగా టీడీపీ అధిష్ఠానమే ఆ వ్యయాన్ని భరిస్తుందని చెప్పారు. వచ్చే సంక్రాంతికి కార్యాలయాన్ని ప్రారంభించి ప్రాంగణంలో సంబరాలు నిర్వహించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. భూమిపూజ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి. కనిగిరి నియోజకవర్గాల నుంచి పార్టీశ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించిన నాలుగు దశాబ్దాల తర్వాత ఒంగోలులో సొంత కార్యాలయం రూపుదిద్దుకుంటుండటం పట్ల వారు సంతోషం వ్యక్తంచేశారు.
టీడీపీ ఆవిర్భావంతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులు
టీడీపీ ఆవిర్భావంతోనే తెలుగు సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి డాక్టర్ స్వామి అన్నారు. పార్టీ కార్యాలయ భూమిపూజ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ వేసిన పునాదితో 44 ఏళ్లుగా పసుపుజెండా రెపరెపలాడుతుందన్నారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేష్లు పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమం, సామాజికన్యాయం కోసం వారిద్దరి నేతృత్వంలో పార్టీ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రధానమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నదన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం అంటూ శిలాఫలకం వేసి జగన్ ప్రజలను దగా చేశాడని ధ్వజమెత్తారు. జగన్ మోసాన్ని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారన్నారు. రాజకీయాల్లో ఏ మాత్రం విలువలు లేని పార్టీ వైసీపీ అని విమర్శించారు.