సాగర్ కాలువలను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:18 AM
సాగర్ కాలువల్లో నీటి సరఫరాను ఇరిగేషన్ అధికారులు బుధవారం పరిశీలించారు. ‘తాగునీటి సరఫరాలో అన్యాయం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఇన్చార్జి ఎస్ఈ సతీష్, దర్శి, చీమకుర్తి ఈఈలు స్వామి, గురజాల తదితరులు ఒంగోలు బ్రాంచ్ కాలువ హెడ్ వద్ద నీటి సరఫరాను చూశారు.
జిల్లాకు పెరిగిన నీటి సరఫరా పరిమాణం
దర్శి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సాగర్ కాలువల్లో నీటి సరఫరాను ఇరిగేషన్ అధికారులు బుధవారం పరిశీలించారు. ‘తాగునీటి సరఫరాలో అన్యాయం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఇన్చార్జి ఎస్ఈ సతీష్, దర్శి, చీమకుర్తి ఈఈలు స్వామి, గురజాల తదితరులు ఒంగోలు బ్రాంచ్ కాలువ హెడ్ వద్ద నీటి సరఫరాను చూశారు. అక్కడ అతితక్కువగా 385 క్యూసెక్కులు మాత్రమే సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా అధికారులతో మాట్లాడి జిల్లాకు నీటి సరఫరా పెంచేందుకు కృషి చేశారు. ప్రస్తుతం సాగర్ ప్రధాన కాలువ 85/3వ మైలు (ఉమ్మడి ప్రకాశం జిల్లా సరిహద్దు)కు 1,711 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అది రెండు రోజుల క్రితం కేవలం 1,400 క్యూసెక్కులు మాత్రమే ఉంది. ఎట్టకేలకు 300 క్యూసెక్కుల మేర పెరిగింది. అద్దంకి బ్రాంచ్ కాలువకు కూడా 50 క్యూసెక్కులు పెంచారు. మొత్తంమీద జిల్లాకు దాదాపు 350 క్యూసెక్కుల నీటి పరిమాణం పెరిగింది. వాటా ప్రకారం మరో 150 క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. ఆ మేరకు గుంటూరు జిల్లా నుంచి నీరు విడుదలయ్యే విధంగా కృషి చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి, చీమకుర్తి డీఈలు పూర్ణచంద్, దేవసహాయం పాల్గొన్నారు.