ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:07 AM
హెచ్ఎంపాడు మండలం వెంగపల్లిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
హెచ్ఎంపాడు మండలంలోని వెంగపల్లిలో విషాదం
కనిగిరి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : హెచ్ఎంపాడు మండలం వెంగపల్లిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంగపల్లికి చెందిన మేళం వెంకటేశ్వర్లు, ఆయన భార్య గురువారం ఉదయం పనిమీద కనిగిరి వెళ్లారు. రాత్రి సుమారు 8గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చే సరికి కుమార్తె గీతాంజలి(16) ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయి ఉంది. దీంతో వారు షాక్కు గురయ్యారు. ఆ యువతి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కుమార్తె మృతదేహాన్ని చూసిన తండ్రి వెంటనే హెచ్ఎంపాడు పోలీ్సస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.