తౌషిక్ మృతిపై ముమ్మర దర్యాప్తు
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:10 AM
విద్యార్థి తౌషిక్ మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని మూలగుంట పాడు శ్రీచైతన్య నవోదయ స్కూల్ హాస్టల్లో ఫిబ్రవరి 14న కనిగిరి చెందిన ఆరవ తరగతి విద్యార్థి షేక్ తౌషిక్(11) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే.
శ్రీచైతన్య నవోదయ స్కూల్ హాస్టల్లో మరోసారి
విచారణ చేపట్టిన నెల్లూరు ఏఎస్పీ సౌజన్య
మంగళగిరి ఫోరెన్సిక్ బృందంతో ఆధారాల సేకరణ
సింగరాయకొండ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి తౌషిక్ మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని మూలగుంట పాడు శ్రీచైతన్య నవోదయ స్కూల్ హాస్టల్లో ఫిబ్రవరి 14న కనిగిరి చెందిన ఆరవ తరగతి విద్యార్థి షేక్ తౌషిక్(11) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో నెల్లూరు ఏఎస్పీ సౌజన్య విచారణ చేపట్టారు. తొలుత ఈనెల 4న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కూల్ యాజమాన్యం ఫోన్లు, స్కూల్ సమీపంలోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మరోసారి స్కూల్ హాస్టల్లో ఏఎస్పీ విచారణ చేపట్టారు. మంగళగిరి నుంచి ఫోరోన్సిక్ నిపుణుల బృందాన్ని పిలిపించారు. విద్యార్థి మృతి చెందిన బాత్రూమ్ను, హ్యాంగర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. హ్యాంగర్ ఎన్ని అడుగుల ఎత్తులో ఉందో కొలతలు తీసుకున్నారు. హ్యాంగర్కు ఉరివేసుకుంటే మృతిచెందే అవకాశం ఉందా? లేదా? అని పరిశీలించారు. అనంతరం స్కూల్ యాజమాన్యాన్ని విచారించారు. విచారణలో కందుకూరు సీఐ అన్వర్బాషా, జరుగుమల్లి, ఉలవపాడు ఎస్సైలు బి.మహేంద్ర, సుబ్బారావు పాల్గొన్నారు.