పూరిమెట్ల మాజీ సర్పంచ్ నిధులు స్వాహా
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:23 PM
ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల పంచాయతీ మాజీ సర్పంచ్ ఓగులూరి రామాంజి 15వ ఆర్థిక సంఘం నిధులు 10లక్షల రూపాయలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అద్దంకి యూనియన్ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించగా విషయం బయటపడింది.
15వ ఆర్థిక సంఘం నిధులు పదిలక్షలు పక్కదారి
గతంలోనూ నిధులు స్వాహా చేయటంతో చెక్కు పవర్ రద్దు
వైసీపీ సానుభూతిపరుడైన మాజీ సర్పంచ్ లీలలు
తలలు పట్టుకున్న మండల పరిషత్ అధికారులు
ముండ్లమూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పూరిమెట్ల పంచాయతీ మాజీ సర్పంచ్ ఓగులూరి రామాంజి 15వ ఆర్థిక సంఘం నిధులు 10లక్షల రూపాయలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అద్దంకి యూనియన్ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించగా విషయం బయటపడింది. దీంతో మండల పరిషత్ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. సర్పంచ్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగిసింది. మొదటగా మార్చి 31వ తేదీ 5లక్షల రూపాయలు, అద్దంకిలోని యూనియన్ బ్యాంకు నుంచి తమ ఖాతా బ్యాంకు అయిన ఏడీపీ ఎస్బీఐ బ్యాంక్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మళ్లీ ఏప్రిల్ 16వ తేదీ 5లక్షలను కూడా తమ ఖాతా బ్యాంకు అయిన ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దీంతో మొత్తం పది లక్షల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు స్వాహా చేసిన విషయం బయటపడింది. బ్యాంక్ అధికారులు కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులను అడిగి 15వ ఆర్ధిక సంఘం నిధులు దారిమరలడానికి ఏ అధికారులు సహకరించారనేది విచారణ చేపట్టారు. ఇదే గ్రామ సర్పంచ్ రామాంజి పదవిలో ఉన్న సమయంలో కూడా రెండుసార్లు రూ.1,37,296లు మళ్లీ రూ.1,20,000 నిధులు స్వాహా చేశారు. అధికారులు సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. ఆ తరువాత ఎంపీడీవో శ్రీదేవికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ మాజీ సర్పంచ్ అయిన తర్వాత కూడా 10లక్షల రూపాయలు నిధులు స్వాహా వెనుక ఎవరి హస్తం ఉన్నదనే ది తేలాల్సి ఉంది. వాస్తవానికి 15వ ఆర్థిక సంఘంలో మార్చకుండా ఉండేందుకు గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ నుంచి నిధులు లావాదేవీలు నిలిపివేశారు.