గృహ గణన వేగవంతంపై దృష్టి
ABN , Publish Date - May 20 , 2026 | 02:31 AM
జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టిన గృహగణన వేగవంతంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈనెల 30వతేదీ లోపు గృహ గణనను పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లాలో ఈ ప్రక్రియను క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టారు.
కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో కదిలిన క్షేత్రస్థాయి సిబ్బంది
అర్బన్ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతున్న ప్రక్రియ
గ్రామీణ ప్రాంతాల్లో జోరందుకున్న సర్వే
ఒంగోలు కలెక్టరేట్, మే 19 (ఆంధ్రజ్యోతి) : జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టిన గృహగణన వేగవంతంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈనెల 30వతేదీ లోపు గృహ గణనను పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లాలో ఈ ప్రక్రియను క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టారు. ఆశించిన స్థాయిలో సర్వే ముందుకు సాగడం లేదన్న విషయాన్ని కలెక్టర్ రాజాబాబు గుర్తించారు. జిల్లాలో వెనుకబడిన మండలాల వారీగా సమీక్షించి సంబంధిత అధికారులు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసేందుకు దిశానిర్దేశం చేయడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై వేటు వేసేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. దీంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా గృహగణన ప్రక్రియ వేగవంతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే వేగంగా సాగుతున్నప్పటికీ అర్బన్(పట్టణ) ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా నడుస్తుండటంతో సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో 70శాతం పూర్తి
జిల్లాలో 70శాతం గృహ గణన పూర్తయ్యింది. అద్దంకి డివిజన్లో 67.98శాతం, ఒంగోలు డివిజన్ 70.05శాతం, కందుకూరు డివిజన్ 71.31శాతం సర్వే జరిగింది. అద్దంకి అర్బన్లో 53.94శాతం, దర్శి అర్బన్లో 59.41శాతం, కందుకూరు అర్బన్లో 62,73 శాతం, చీమకుర్తి అర్బన్లో 64.96శాతం, ఒంగోలు అర్బన్లో 60.38 శాతం మాత్రమే సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే 70శాతంపైగానే ఉండగా అర్బన్ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. దీంతో ఈ సర్వేను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.