ఉద్యోగుల ఆనందోత్సవాలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:00 AM
ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సీఎం తీసుకున్న నిర్ణయాల పట్ల వారిలో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ సంఘాలతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశంలో వారి సమస్యలతోపాటు ఆర్థికపరమైన అంశాలను విడతల వారీగా పరిష్కరిస్తామని ప్రకటించారు.
సీఎం నిర్ణయాలపై హర్షాతిరేకాలు
ఒంగోలులో బాణసంచా కాల్చి సంబరాలు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సీఎం తీసుకున్న నిర్ణయాల పట్ల వారిలో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ సంఘాలతో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశంలో వారి సమస్యలతోపాటు ఆర్థికపరమైన అంశాలను విడతల వారీగా పరిష్కరిస్తామని ప్రకటించారు. దీంతో ఏపీఎన్జీవోల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. స్థానిక ఎన్జీవో భవన్ వద్ద సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూచిపూడి శరత్బాబు, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో శనివారం సాయంత్రం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శరత్బాబు, కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభు త్వం దృష్టికి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జేఎసీ చైర్మన్ సాగర్ బాధ్యతాయుతంగా తీసుకెళ్లి సానుకూల దృక్పథంతో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. సీఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు ఆర్థికపరమైన అంశాలపై చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. 12వ పీఆర్సీ నియామకంతోపాటు, రెండు నెలల డీఏల చెల్లింపునకు అంగీకారం, ఒక సరెండర్ లీవ్, పోలీసులకు ఒకటి అడిషనల్ సరెండర్ లీవ్ చెల్లింపుతోపాటు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇచ్చేందుకు సీఎం అంగీకరించారన్నారు. దీని వల్ల 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పది శాతం, 75ఏళ్లు దాటిన పెన్షనర్లకు 15శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందన్నారు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లతోపాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం వంటి వాటిపై సీఎం సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్జీవో సంఘ నాయకులు కె.శివకుమార్, కృష్ణకిషోర్, ఎం.వెంకటేశ్వరరావు, తోట శ్రీనివాస్, పి.రామాంజనేయులు, బి.విజయ్కుమార్, ఆర్.దీపక్కుమార్, కె.కోటేశ్వరమ్మ, మాగం శ్రీనివాసరావు, దప్పిలి మధుసూదన్రెడ్డి, పి.మాధవి, శిరీష కె.మంజేష్, షేక్ మగ్దుంషరీఫ్, జిలానీ, నారాయణమ్మ, రత్నాకర్బాబు తదితరులు పాల్గొన్నారు.