అంగన్వాడీలకు కరెంటు పొయ్యిలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:27 AM
గ్యాస్ సమస్యను అధిగమించేందుకు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కరెంటు పొయ్యి (ఇండక్షన్ స్టవ్)లను అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ఈసీపీ కింద రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ద్వారా దీన్ని అమలు చేస్తోంది.
రెండో విడత ఇవ్వనున్న ప్రభుత్వం
మొదటి దఫా ఇప్పటికే 259 పంపిణీ
మార్కాపురం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ సమస్యను అధిగమించేందుకు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కరెంటు పొయ్యి (ఇండక్షన్ స్టవ్)లను అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ఈసీపీ కింద రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ద్వారా దీన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తొలివిడత దాదాపు 8 నెలల క్రితం కొన్ని కేంద్రాలకు స్టవ్లను అందజేశారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 1,628 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో తొలివిడత ఇప్పటికే 259 స్టవ్లను కేంద్రాలకు పంపిణీ చేశారు. వాటిలో మార్కాపురం మునిసిపాలిటీకి 157, కనిగిరి మునిసిపాలిటీకి 102 ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రెండో విడత పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ స్టవ్లను అందించగలిగితే గ్యాస్ సమస్య తీరనుంది. పర్యావరణ పరిరక్షణతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. చాలా కేంద్రాల్లో రెండు సిలిండర్లు ఉండడం వల్ల ఇప్పటి వరకూ గ్యాస్కు ఇబ్బంది కలగలేదు. మున్ముందు సమస్య ఎదురయ్యే కేంద్రాల వివరాలతో జిల్లా అధికారులు నివేదికను తయారు చేస్తున్నారు. వాటికి త్వరలో ఇండక్షన్ స్టవ్లను ఇవ్వనున్నారు.