మార్కాపురం జిల్లా అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 18 , 2026 | 02:44 AM
వెనుకబడిన ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న ఆయన్ను ఈనెల 12న మార్కాపురం జిల్లా జేసీగా ప్రభుత్వం నియమించింది.
బాధ్యతలు చేపట్టిన జేసీ శ్రీనివాసులు
అక్కడి కలెక్టరేట్లో పనుల పరిశీలన
అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు
మార్కాపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న ఆయన్ను ఈనెల 12న మార్కాపురం జిల్లా జేసీగా ప్రభుత్వం నియమించింది. శనివారం ఆయన ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనకు ఉమ్మడి జిల్లాలో డీఆర్వోగా పనిచేసిన అనుభవంతోపాటు ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తానన్నారు. తొలుత ఆయన కలెక్టరేట్లో ఏర్పాట్లకు సంబంధించి చేస్తున్న పనులను పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలో ఎస్వీకేపీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు ఈ స్థలం ఎంపిక చేసిన క్రమంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి స్థానిక అధికారులతో మాట్లాడారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జేసీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ నాగరాజు, మార్కాపురం సీఐ సుబ్బారావు జేసీకి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ నారాయణరావు, మార్కాపురం, కంభం, త్రిపురాంతకం తహసీల్దార్లు చిరంజీవి, కిరణ్, కృష్ణమోహన్ వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, రెవెన్యూ ఉద్యోగులు జేసీ శ్రీనివాసులుకు బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు.