ఇంటింటికీ తాగునీరు
ABN , Publish Date - Feb 15 , 2026 | 02:51 AM
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యమని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. అందుకోసం రాష్ట్రంలోని 123 మునిసిపాలిటీలలో రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
పట్టణాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యం
ఒడా ఆదాయం ఆయా నియోజకవర్గాల అభివృద్ధికే ఖర్చు
విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ వెల్లడి
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యమని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. అందుకోసం రాష్ట్రంలోని 123 మునిసిపాలిటీలలో రూ.14వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక ప్రకాశం భవనంలో అర్బన్ అథారిటీ, మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసంఒంగోలులోని ట్రంక్రోడ్డు విస్తరణ చేయాల్సి ఉందని, అందుకు కొంత నిధులు అవసరమవుతాయని స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ కోరారని చెప్పారు. త్వరలోనే ఆ నిధు లను మంజూరు చేసి ట్రంక్రోడ్డు విస్తరణ చేపడతామన్నారు. అర్బన్ అథారిటీలో ఏ నియోజకవర్గం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆ నియోజక వర్గానికే ఖర్చుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ప్రతి పట్టణంలో రూ.5వేల కోట్లతో డ్రెయిన్ల నిర్మాణానికి ఇంజనీర్లు అంచనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. వచ్చేనెలలో టెండర్లు పూర్తిచేస్తామని చెప్పారు. సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, జాయిం ట్ కలెక్టర్ కల్పనాకుమారి, నగర కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.