సహేతుక కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించొద్దు
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:04 PM
సహేతుక కారణాలు లేకుండా ఓటరు దరఖాస్తులను, అభ్యంతరాలను తిరస్కరించవద్దని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు.
కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): సహేతుక కారణాలు లేకుండా ఓటరు దరఖాస్తులను, అభ్యంతరాలను తిరస్కరించవద్దని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. ఓటర్లు సమర్పించే ఫొటో నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అఽధికారి వివేక్యాదవ్ గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా తుది జాబితాతోపాటు అభ్యంతరాలపై నోటీసులు జారీ, దర ఖాస్తుల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా అంశాలలో పెండింగ్ స్వల్పంగా ఉన్నందున వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నియోజకవర్గాల వారీగా కలెక్టర్ సమీక్షించి ఆర్వోలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పీ వెంకటరమణ, ఈఆర్వోలు హిమవంశీ, రవికుమార్, చంద్రశేఖర్నాయుడు, మాధురి, శాంతిలక్ష్మి, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
ఘనంగా విశ్వకర్మ జయంతోత్సవం
బీసీ సంక్షేమ, సాధికార శాఖ ఆధ్వర్యంలో శ్రీశ్రీ మహారాజశ్రీ విశ్వకర్మ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పీ రాజాబాబు ముఖ్యఅతిధిగా పాల్గొని మహారాజశ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాజశ్రీ విశ్వకర్మ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి పీ వెంకటరమణ, బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి ఎస్. నిర్మల జ్యోతి, వివిధ సంఘాల నాయకులు పీ సాయిబాబు, బాలసుబ్రహ్మణ్యం, జీ బ్రహ్మానందశర్మ, కే శ్రీనివవాస్, సహాయసంక్షేమ అధికారులు సీహెచ్ వెంకట్రావు, షేక్ జబ్బార్ తదితరులు ఉన్నారు.