Share News

ఒంగోలులో అవినీతి, అక్రమాలను సహించేది లేదు

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:35 PM

ఒంగోలు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని జనసేన పార్టీ నాయకుడు బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కూటమిలో భాగస్వామ్యం ఉన్నందున తాను ఏమి మాట్లాడకుండా హైదరాబాద్‌లో ఉన్నానని తెలిపారు.

ఒంగోలులో అవినీతి, అక్రమాలను సహించేది లేదు
మాట్లాడుతున్న బాలినేని

తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో భూ సెటిల్‌మెంట్లు

బియ్యం, మద్యం, ఇసుక, మైనింగ్‌లో భారీ అక్రమాలు

కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందునే సైలెంట్‌గా ఉన్నా...

అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోవాలా?

మాజీమంత్రి. జనసేన నేత బాలినేని వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని జనసేన పార్టీ నాయకుడు బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కూటమిలో భాగస్వామ్యం ఉన్నందున తాను ఏమి మాట్లాడకుండా హైదరాబాద్‌లో ఉన్నానని తెలిపారు. ఇప్పుడు తన అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. స్థానిక లాయర్‌పేటలోని బాలినేని నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలులో భూకబ్జాలు తారస్థాయికి చేరాయన్నారు. వెంకట సుబ్బారావు స్థలాన్ని కాజేసేందుకు తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో సీఐ నేతృత్వంలో బలవంతంగా సంతకాలు పెట్టించుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణాలో ఎమ్మెల్యే నెలకు రూ.25 లక్షలు తీసుకుంటున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో తనపై, తన కొడుకుపై అనేక అరోపణలు చేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో జరిగినవాటితో పాటు ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు విచారణ చేయిస్తే నిజనిజాలు బయటపడుతాయన్నారు. వైన్‌షాపుల్లో వచ్చే కలెక్షన్‌ను కాంట్రాక్టర్‌ పావులూరి నాగేశ్వరరావు తీసుకెళ్లి ఎమ్మెల్యేఇంట్లో డబ్బులు ఇవ్వాలని చెప్పారు. ఒంగోలులో సగం మద్యంషాపులు ఎవరు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీలో నిరంతరం పనిచేసిన కొటారి నాగేశ్వరరావుకు మద్యంషాపు వస్తే జీర్ణించుకోలేక ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలియదా అని ప్రశ్నించారు. కొప్పోలు వద్ద వేసిన వెంచర్‌కు భారీ స్థాయిలో గ్రావెల్‌ తోలుకున్నది వాస్తవమేనని తెలిపారు. కొత్తపట్నం మండలం రాజుపాలెంలో ఎమ్మెల్యే డీకే భూములలో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుక డంప్‌ను ఏర్పాటు చేసి నెలకు రూ.50 లక్షలు సంపాదిస్తున్నారని చెప్పారు. 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన స్థలంలో తన వియ్యంకుడు విల్లాలు కడితే దాంట్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారన్నారు. మైనింగ్‌ డస్ట్‌ రవాణా విషయంలో తాలూకా సీఐకి ఫోన్‌ చేస్తే ఏకవచనంతో సంబోధించారని చెప్పారు. తాలూకా సీఐ చేస్తున్న ఆరాచకరాలతో వీఆర్‌కు పంపితే మళ్లీ ఎమ్మెల్యే తెచ్చుకున్నాడంటే దాని అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఐదునెలల క్రితం ఎమ్మెల్యేపై కరపత్రాన్ని వేసిన కిరణ్‌ అనే వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇందులో తన అనుచరుడైన బొమ్మినేని మురళీపై కూడా కేసు పెట్టారన్నారు. నేను రాజు.. నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, రాయపాటి అరుణ, మునగా రమే్‌షబాబు, గోలి తిరుపతిరావు ఉన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:35 PM