Share News

కరోనా కలవరం

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:53 AM

రాష్ట్రంలో చాపకింద నీరులా కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. కడపతో పాటు ఇతర పలు జిల్లాల్లో కేసులు వెలుగుచూస్తుండటంతో జిల్లాలో ముం దస్తుగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒంగోలులోని జీజీహెచ్‌తోపాటు ఏరియా వైద్యశాలల్లో అనుమానితులకు స్ర్కీనింగ్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

కరోనా కలవరం
ఒంగోలు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డులో వైద్యులు, సిబ్బంది

కేసుల నమోదుతో వైద్యశాఖ అప్రమత్తం

జీజీహెచ్‌తోపాటు ఏరియా వైద్యశాలల్లో స్ర్కీనింగ్‌ పరీక్షలు

ప్రత్యేకంగా కొవిడ్‌ వార్డుల ఏర్పాటుకు చర్యలు

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 17 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్రంలో చాపకింద నీరులా కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. కడపతో పాటు ఇతర పలు జిల్లాల్లో కేసులు వెలుగుచూస్తుండటంతో జిల్లాలో ముం దస్తుగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒంగోలులోని జీజీహెచ్‌తోపాటు ఏరియా వైద్యశాలల్లో అనుమానితులకు స్ర్కీనింగ్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ పాజిటివ్‌ వస్తే వెంటనే వారికి ఐసోలే షన్‌ వార్డుతోపాటు ఆయా వైద్యశాలల్లో ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో ఎనిమిది కొవిడ్‌ కేసులు నమోదు కాగా గుంటూరులో రెండు, విశాఖ, కాకినాడలో ఒక్కో కేసు వెలుగు చూసింది. నలుగురు మృత్యు వాత పడ్డారు. కర్ణాటక, కేరళల్లో కూడా కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రాకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నారు. వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో జీజీహెచ్‌తోపాటు అన్ని ఏరియా వైద్యశాలలను అలర్ట్‌ చేస్తూ డీఎంహెచ్‌వో డాక్టర్‌ టి. వెంకటేశ్వర్లు సర్క్యులర్‌ను జారీచేశారు. కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే శాంపిల్స్‌ను తీసి ల్యాబ్‌కు పంపాలన్నారు. అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచడంతో ఆయా వైద్యశాలల్లో ఐసోలేషన్‌ వార్డు, ఆక్సిజన్‌ బెడ్లు, ఐసీయూ, వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలని ఆ సర్క్యులర్‌లో ఆదేశించారు. ప్రజలు కూడా మాస్కులు ధరించడంతోపాటు శుభ్రత పాటించాలన్నారు. జ్వరం నొప్పులు వంటివి ఉంటే వెంటనే సమీపంలోని వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. ఒంగోలులోని జీజీహెచ్‌లో శుక్రవారం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. దీన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాణిక్యరావు పరిశీలించారు.

Updated Date - Jul 18 , 2026 | 01:53 AM