శరవేగంగా ఆరోగ్యసేవా భవనాల నిర్మాణం
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:44 PM
ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా యద్దనపూడి మండల పరిధిలో పూనూరు గ్రామంలో వేగంగా రెండు ఆరోగ్య సేవా భవనాలను నిర్మిస్తున్నారు.
పూనూరులో హోమియో వైద్యశాలకు కొత్త కేంద్రం, అలాగే రెండు హెల్త్ క్లినిక్లు
మార్టూరులో ఆయుష్ హాస్పిటల్కు నూతన బిల్డింగ్
ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యం
యద్దనపూడి,(మార్టూరు) ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా యద్దనపూడి మండల పరిధిలో పూనూరు గ్రామంలో వేగంగా రెండు ఆరోగ్య సేవా భవనాలను నిర్మిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న హామియా హాస్పిటల్ భవనం శిథిలదశకు చేరడంతో, నూతన భవన నిర్మాణానికి 33 లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. పాత హోమియా వైద్యశాల భవనాన్ని కూల్చారు. దాని స్థానంలో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టారు. అందుకు సంబంధించి ప్రస్తుతం పునాదుల దశ వరకు పనులు చకాచకా జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రామంలో ఉన్న రెండు గ్రామ సచివాలయాల పరిధిలో రెండు హెల్త్ క్లినిక్లు భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. వాటిలో ఒక హెల్త్ క్లినిక్ భవనాన్ని 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించి సిమెంటు, ఇనుముతో పిల్లర్లను నిలబెట్టారు. ఇక రెండవ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి ఇంతవరకు స్థలం ఎంపిక చేయకపోవడంతో పనులు ప్రారంభించలేదు. రెవెన్యూ అధికారులు గ్రామంలో రెండవ హెల్త్ క్లినిక్ను నిర్మించడానికి స్థలాన్ని ఎంపికచేసే పనిలో ఉన్నారు. వీలైనంత త్వరగా రెండవ హెల్త్ క్లినిక్ పనులను ప్రారంభిస్తారని సోమవారం పంచాయతీ కార్యదర్శి భాగ్యరాజా తెలిపారు.
మార్టూరులో ఆయుష్ హాస్పిటల్ భవనం
మార్టూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటరు ఆవరణలో ఆయుష్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఆయుష్ హాస్పిటల్ను నిర్వహించేందుకు మార్టూరులో సొంతం భవనం లేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటరు కార్యాలయంలో మొదటి అంతస్తులో ఆయుష్ హాస్పిటల్ను నిర్వహిస్తున్నారు. దాంతో నూతనంగా హాస్పిటల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం 30 లక్షల రూపాయలు నిధులను మంజూరుచేసింది. వాటితో నిర్మాణ పనులను ప్రారంభించారు.