సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు
ABN , Publish Date - Feb 22 , 2026 | 02:36 AM
ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈనెల 25న ఆయన వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద టన్నెళ్లను పరిశీలించను న్నారు. రూ.456 కోట్లతో జరుగుతున్న ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
25న వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శన
కొత్తూరు వద్ద టన్నెళ్ల పరిశీలన
ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన
ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికార యంత్రాంగం
పరిశీలించిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
మార్కాపురం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈనెల 25న ఆయన వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద టన్నెళ్లను పరిశీలించను న్నారు. రూ.456 కోట్లతో జరుగుతున్న ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఏర్పాట్లలో వేగం పెంచారు. శనివారం జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద సీఎం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి ఫీడర్ కాలువ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను జేసీ ఆదేశించారు. హెలిప్యాడ్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. మరోవైపు సీఎం కార్యక్రమ పర్యవేక్షణకు బందోబస్తు, సభా స్థలం వద్ద ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, తాగునీటి వసతి, విద్యుత్ పనులు, బారికేడ్లు ఇలా అన్నింటి పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులకు కలెక్టర్ రాజాబాబు బాధ్యతలు అప్పగించారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సీఎం కార్యక్రమంలో ప్రజావేదిక పేరుతో పబ్లిక్ మీటింగ్, తరువాత పార్టీ శ్రేణులతో సమావేశం ఉంటుందన్న సమాచారంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారి వస్తున్నందున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.