మండిన ఎండ
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:06 AM
భానుడి భగభగతో ప్రజలు తల్లడిల్లిపోయారు. రెండు రోజులుగా ఎండతీవ్రతతోపాటు ఉక్కపోత పెరిగింది. జిల్లాలో సాధారణంగా మే మొదటి వారం నుంచి ఎండ బాగా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటివారం నుంచే మంటలు మొదల య్యాయి.
తొమ్మిది మండలాల్లో 40డిగ్రీలపైన గరిష్ఠ ఉష్ణోగ్రత
తల్లడిల్లిన ప్రజలు
పెరిగిన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
ఒంగోలు నగరంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యం
శీతలపానీయాలకు డిమాండ్
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : భానుడి భగభగతో ప్రజలు తల్లడిల్లిపోయారు. రెండు రోజులుగా ఎండతీవ్రతతోపాటు ఉక్కపోత పెరిగింది. జిల్లాలో సాధారణంగా మే మొదటి వారం నుంచి ఎండ బాగా ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటివారం నుంచే మంటలు మొదల య్యాయి. ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాల్చుతు న్నాయి. మంగళవారం జిల్లాలోని తొమ్మిది మండ లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. అత్యధికంగా బల్లికురవలో 43.2 డిగ్రీలు నమోదైంది. సంతనూతలపాడులో 42.8, అద్దంకిలో 42.4, తాళ్లూరు, వలేటివారిపాలెంలో 40.7, లింగసముద్రంలో 40.6, చీమకుర్తిలో 40.5, కందుకూరులో 40.4, పొన్నలూరులో 41 డిగ్రీల ఎండకాచింది. ఒంగోలులో 37.5 డిగ్రీలు నమోదైంది. దీంతో ప్రజలు ఠారెత్తిపోయారు. ఉదయం 11 గంటల తర్వాత గడపదాటి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. దీంతో సాయంత్రం 4.30గంటల వరకూ నగరంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఎండ తీవ్రతతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు చల్లటి పానీయాలు కొనుగోలు చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.