అదిరేలా బీచ్ ఫెస్టివల్
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:56 PM
సింగరాయకొండ, మండలంలో పాకల బీచ్ ఫెస్టివల్ను ఈ నెల 14, 15 తేదీల్లో అబ్చురపరిచేలా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆదివారం పాకల బీచ్లో కలెక్టర్ రాజాబాబు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి పాకల బీచ్ ఫెస్టివల్ ఏవీని ఆవిష్కరించారు.
14, 15 తేదీల్లో నిర్వహణ : మంత్రి స్వామి
కలెక్టర్ రాజాబాబు, సత్య, నూకసానితో కలిసి ఏవీ విడుదల
నేడు ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల ఆధ్వర్యంలో కార్యక్రమం
10న కందుకూరు, కనిగిరి, పొదిలిలో 2కే రన్
సింగరాయకొండ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : మండలంలో పాకల బీచ్ ఫెస్టివల్ను ఈ నెల 14, 15 తేదీల్లో అబ్చురపరిచేలా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆదివారం పాకల బీచ్లో కలెక్టర్ రాజాబాబు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి పాకల బీచ్ ఫెస్టివల్ ఏవీని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ.. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో బీచ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ ఫెస్టివల్లో హెలికాఫ్టర్ రైడింగ్, బోట్ రైడింగ్, పారా రైడింగ్తోపాటు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీచ్ ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో కర్టన్ రైజర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. 10వ తేదీన కందుకూరు, కనిగిరి, పొదిలిలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో 2కే రన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పాకల బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడతుందన్నారు. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే బీచ్ ఫెస్టివల్లో అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని సంతోషంగా గడపాలని కోరారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ భవిష్యత్లో రాష్ట్రంలో అభివృద్ధి చెందిన మొదటి 10 బీచ్ల్లో పాకల ఒకటిగా ఉంటుందని చెప్పారు.
విద్యార్థులతో కలిసి పారిశుధ్య కార్యక్రమాలు
స్వచ్ఛ పాకలలో విద్యార్థులతో కలిసి మంత్రితోపాటు కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వయంగా వ్యర్థాలను తొలగించారు. అనంతరం పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక వ్యవహారాలశాఖ సంచాలకులు మల్లికార్జునరావు, పర్యాటకశాఖ మేనేజర్ నాంచారయ్య, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీఎస్పీ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, సర్పంచ్ సైకం చంద్రశేఖర్ పాల్గొన్నారు.