చికిత్స పొందుతున్న యువకుడు మృతి
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:21 PM
ప్రేమించిన మైనర్ బాలికతో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిరాకరించటంతో ఎలుకల మందు పేస్ట్ తిని చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రేమ వివాహాన్ని నిరాకరించిన తల్లిదండ్రులు
అద్దంకి, జనవరి 13(ఆంధ్రజ్యోతి) : ప్రేమించిన మైనర్ బాలికతో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిరాకరించటంతో ఎలుకల మందు పేస్ట్ తిని చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... అద్దంకి పట్టణంలోని బత్తులవారిపాలెంకు చెందిన బత్తుల క్రాంతి(19) మైనర్ బాలికను ప్రేమించాడు. ఆ బాలికతో వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరగా నిరాకరించారు. దీంతో ఈ నెల 11వ తేదీ ఎలుకల మందు పేస్ట్ తిన్నాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.
మోటార్ వాహనం ఢీకొనటంతో వ్యక్తి మృతి
తాళ్లూరు, జన వరి13 (ఆంధ్రజ్యోతి) : రోడ్డుపై నడిచి వెళుతుండగా దళితవాడ పెట్రోలు బంక్ సమీపాన వేగంగా వస్తున్న మోటార్ వాహనం ఢీకొనటంతో ఓ బాటసారి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారంసాయంత్రం తాళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే... దళితవాడకు చెందిన మందా చిన్నా(63) ఇంటి నుంచి నడుచుకుంటూ గ్రామంలోకి వస్తున్నారు. తాళ్లూరుకు చెందిన ఇద్దరు మైనర్బాలురు అతివేగంగా మోటార్వాహనాల పందెం పెట్టుకుని వెల్లంపల్లి రోడ్డువైపు వెళుతున్నారు. నడుచుకుంటూ వస్తున్న చిన్నాను వేగంగా ఢీకొట్టగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో తల వెనుక, నుదుట, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడికి స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. రిమ్స్లోపలకు తీసుకెళుతుండగా మృతి చెందాడు. మృతుడు చిన్నాఅవివాహితుడు. అతని మరణంతో కాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి.