యువకుడు ఆత్మహత్య
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:49 PM
ముండ్లమూరు, మండలంలోని పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన ఓలేటి వెంకటేశ్వర్లు, అరుణ కుమారుడు శ్రీహర్ష (26) నాలుగేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు.
బీటెక్ చదివి ఉద్యోగం రాలేదని మనస్తాపం
కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు
ముండ్లమూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన ఓలేటి వెంకటేశ్వర్లు, అరుణ కుమారుడు శ్రీహర్ష (26) నాలుగేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాదులో కోచింగ్ సెంటర్లో చేరి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లు అయినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. హైదరాబాద్ నుంచి ఆదివారం స్వగ్రామమైన పెద్ద ఉల్లగల్లు చేరుకున్నాడు. రెండు రోజులు తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున అనగా మంగళవారం తల్లిదండ్రులు చూసేసరికి ఉరివేసుకుని మృతిచెంది ఉన్నాడు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ముండ్లమూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని సింగనపాలేనికి చెందిన కోయ శ్రీనివాసరావు (53) ఈనెల 5వ తేదీ సాయంత్రం పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం మొదట దర్శి అసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించ గా చికిత్స పొందుతూ గత రాత్రి మృతిచెందాడు. శ్రీనివాసరావుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చనిపోవడమే మార్గమని భావించి పురుగుల మందు తాగాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సందర్శించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
అద్దంకి, సెప్టెంబరు8(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ జొన్నలగడ్డ సంధ్య(31) చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు... మేదరమెట్లకు చెందిన జొన్నలగడ్డ మహేష్, భార్య సంధ్యతో కలిసి ఆదివారం చర్చిలో ప్రార్థనలకు వచ్చారు. అనంతరం భర్తతో కలిసి మోపెడ్పై అద్దంకి వచ్చి వెళుతుండగా చీర వెనుక చక్రంలో చిక్కుకుంది. దీంతో మోపెడ్పై నుంచి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు, గుంటూరు లలోని వైద్యశాలలకు తరలించారు. గుంటూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందటంతో వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.