పెల్లుబికిన అభిమానం
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:53 AM
ఇటు నేతలు, అటు పార్టీశ్రేణుల్లో డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై ఉన్న నమ్మకం స్పష్టమైంది. అందుకు శనివారం సాయంత్రం ఆయన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగిన తీరు అద్దం పట్టింది. పార్టీ కార్యకర్తలు, శ్రేణులతో ప్రాంగణం కిట కిటలాడగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తరలివ చ్చిన టీడీపీ నాయకులతో వేదిక కూడా కళకళలాడింది.
అట్టహాసంగా ఒంగోలు లోక్సభ అధ్యక్షునిగా ఉగ్ర బాధ్యతల స్వీకరణ
భారీగా తరలివచ్చిన శ్రేణులు, నేతలు
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
ఇటు నేతలు, అటు పార్టీశ్రేణుల్లో డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై ఉన్న నమ్మకం స్పష్టమైంది. అందుకు శనివారం సాయంత్రం ఆయన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగిన తీరు అద్దం పట్టింది. పార్టీ కార్యకర్తలు, శ్రేణులతో ప్రాంగణం కిట కిటలాడగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తరలివ చ్చిన టీడీపీ నాయకులతో వేదిక కూడా కళకళలాడింది. టీడీపీ ఒంగోలు లోక్సభ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్డులోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చూసి తెలుగుదేశం అభిమానులు పులకించిపోయారు. ఒంగోలు లోక్సభ టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డితోపాటు 44మందితో కార్యవర్గాన్ని అధిష్ఠానం ఏర్పాటుచేసిన విషయం విదితమే. అన్ని ప్రాంతాలకు, అన్ని సామాజికవర్గ్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఎక్కువ శాతం నిబద్ధతతో పనిచేసే వారికి అవకాశం కల్పించారు. డాక్టర్ ఉగ్ర బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఒకరోజు ముందే ఖరారు చేశారు. అయినా వేలాదిమంది పార్టీశ్రేణులు తరలివచ్చారు. ఎవరికి వారు సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని రావడం మరో విశేషం. ప్రస్తుతం ఒంగోలు లోక్సభ ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాల పరిధిలో విడిపోయింది. ఉగ్ర ప్రాతినిథ్యం వహించే కనిగిరి మార్కాపురం జిల్లాలో ఉంది. లోక్సభ అధ్యక్షునిగా ఆయన బాధ్యతల స్వీకరణకు రెండు జిల్లాల ప్రతినిధులు తరలివచ్చారు. అలాగే జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనంతోపాటు మంత్రి స్వామి హాజరయ్యారు. ఒంగోలు ఎంపీ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్చార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లాస్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్నవారు తరలివచ్చారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన డాక్టర్ ఉగ్ర అక్కడ ఇద్దరు మంత్రులకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా వేదిక వద్దకు వచ్చారు.