ఎయిడెడ్లో 99 మిగులు పోస్టులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 01:02 AM
ఉమ్మడి జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో 99 మంది మిగులు టీచర్లు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కలు తేల్చింది. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన 47 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ పోస్టు లు ఉన్నట్లు గుర్తించింది.
విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి ప్రకారం గుర్తింపు
అవసరం ఉన్నచోట 64మంది తాత్కాలిక సర్దుబాబు
ఒంగోలు విద్య, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో 99 మంది మిగులు టీచర్లు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కలు తేల్చింది. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన 47 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ పోస్టు లు ఉన్నట్లు గుర్తించింది. ఈ ఏడాది ఆరంభంలో ఎయి డెడ్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక పరిశీలన చేయించింది. ఇద్దరు విద్యా శాఖ అధికారులతో బృందాలను నియమించింది. ఆ కమి టీల నుంచి నివేదికలు తీసుకుంది. తాజాగా పాఠశాల విద్య ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని ఎయిడెడ్ స్కూళ్లలో మిగులు టీచర్లను గుర్తించేందుకు కసరత్తు చేశారు. దీనికోసం డీఈవో రేణుక ప్రత్యేకంగా ప్రొఫార్మాలు రూపొందించి మండల విద్యాధికారుల నుంచి సమాచారం తెప్పించారు. అందులో లోపాలు ఉన్నట్లు గుర్తించిన డీఈవో.. ఎంఈవోలను స్వయంగా ఒంగోలు లోని తన కార్యాలయానికి వచ్చి కోరిన సమాచారం ఇచ్చి వెళ్లాలని ఆదేశించారు. ఎంఈవోల సమాచారం మేరకు జిల్లాలోని 47 ఎయిడెడ్ పాఠశాలల్లో 99 మిగులు టీచర్ పోస్టులు ఉన్నట్లు తేల్చారు. ఎయిడెడ్ పాఠశాలల్లోని మిగులు టీచర్ పోస్టులపై ఆర్జేడీకి నివేదిక సమర్పించినట్లు డీఈవో రేణుక తెలిపారు. మిగులుగా తేలిన 99 టీచర్ పోస్టుల్లో 64మంది సేవలను వినియోగించుకునేందుకు తాత్కాలిక ప్రాతిపదికన వారిని అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు మిగిలిన 35మందిని ఆర్జేడీ ఆదేశాల మేరకు సర్దుబాటు చేయనున్నారు. ఈ 35 మందిలో 15 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, ముగ్గురు గ్రేడ్-2 హెచ్ఎంలు, స్కూలు అసిస్టెంట్లు, గణితం ముగ్గురు, బయోలాజీకల్ సైన్స్ ఇద్దరు, సోషల్ ఒకరు, తెలుగు ఒకరు, హి ందీ 3, గ్రేడ్-2, గ్రేడ్-1 తెలుగు ఇద్దరు, పీఈటీలు ముగ్గుగు ఉన్నారు. తదుపరి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఈ 99 మందిని అవసరం ఉన్న పాఠశాలలకు శాశ్వత ప్రాతిపదికన సర్దుబాటు చేయనున్నారు.