169 కిలోమీటర్లు.. 17 స్టేషన్లు
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:58 AM
గుంటూరు నుంచి కనిగిరి వరకూ ప్రత్యేక ప్యాసింజర్ రైలు నడపాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చుతోంది. మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
త్వరలో రాకపోకలు ప్రారంభం
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, ఎంపీ మాగుంట
కృషితో సాకారమవుతున్న ప్రజల కల
కనిగిరి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : గుంటూరు నుంచి కనిగిరి వరకూ ప్రత్యేక ప్యాసింజర్ రైలు నడపాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చుతోంది. మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. రైలు నడిపేందుకు అవసరమైన అన్ని చర్యలను దక్షణ మధ్య రైల్వే చేపట్టింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి కృషితో త్వరలో ప్రత్యేక ప్యాసింజర్ రైలు నడవనుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరనుంది. గుంటూరు నుంచి కనిగిరికి మొత్తం 169 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతూ ఈ రైలు, 3 గంటల 25 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధమైంది. గుంటూరు జంక్షన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయల్దేరి కనిగిరికి ఉదయం 10:25 గంటలకు చేరుకునే విధంగా టైమింగ్స్ రూపొందించారు. తిరుగు ప్రయాణ సమయాలపై కూడా అధికారులు చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ రైలు మార్గమధ్యంలో 17 స్టేషన్లలో ఆగేలా ప్రణాళికను తయారు చేశారు. నల్లపాడు, పేరేచర్ల, వేమలూరిపాడు, ఫిరంగిపురం, నుదురుపాడు, సతులూరు, నరసరావుపేట, మునుమాక, సంతమాగులూరు, శావల్యాపురం, వినుకొండ, చీకటేగలపాలెం, గుండ్లకమ్మ, దర్శి, రాజంపల్లి, మల్లవరం, పొదిలి వంటి స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ప్రతి స్టేషన్లో 1 నుంచి 2 నిమిషాలు ఆగుతుంది. గుంటూరులో బయల్దేరి, కనిగిరి వరకూ సాగుతుంది. ఈ రెండు స్టేషన్లను కూడా కలుపుపుకుంటే మొత్తం 19 స్టేషన్లకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.