శాంతా-వసంతా ట్రస్టు, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ABN , Publish Date - Feb 08 , 2026 | 10:37 PM
శాంతాబయో టెక్నీక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్. కోడూరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి, వసంత దంపతులు తమ స్వగ్రామం పాపిరెడ్డిపాళెంతో పాటు పరిసర గ్రామ ప్రజల నేత్ర సంరక్షణే లక్ష్యంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
నేత్రదానం కన్నా మిన్న.. ఉన్న చూపును కాపాడటం! ఈ ఆశయంతోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శంకర నేత్రాలయ సంస్థ దాతల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా లక్షలాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
సాధారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన లేక, ఆర్థిక స్తోమత సరిపోక అధిక సంఖ్యలో కంటి పొరలతో పాటు ఇతర చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా శంకర నేత్రాలయ అనేక ఉచిత శిబిరాలను నిర్వహిస్తోంది.
కన్నవారినీ....జన్మభూమినీ స్మరించుకుంటూ..
ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా శాంతాబయో టెక్నీక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్. కోడూరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి, వసంత దంపతులు తమ స్వగ్రామం పాపిరెడ్డిపాళెంతో పాటు పరిసర గ్రామ ప్రజల నేత్ర సంరక్షణే లక్ష్యంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శంకర నేత్రాలయ కంటి వైద్యశాల (చెన్నై), శాంతా - వసంతా ట్రస్టు (హైదరాబాద్) సంయుక్తంగా ఈ ఉచిత కంటి పొర చికిత్స కార్యక్రమాన్ని 9 రోజులపాటు జరపనున్నారు. తమని కన్న అమ్మా, నాన్నలని తాము పుట్టిన జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదన్న సందేశం ఇస్తూ ఇతరులకి స్ఫూర్తి కలిగించేలా వరప్రసాద్ రెడ్డి ఈ మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టారు.
తోటపల్లి గూడూరు మండలంలోని ఇస్కపాళెం గ్రామంలో గల ప్రభుత్వ బీసీ హాస్టల్ ప్రాంగణంలో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు 9 రోజులపాటు , దాదాపు 3వేలమందికి అవసరమైన పరీక్షలు జరిపి, ఇదే శిబిరంలో చివరి 5 రోజులు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. రోగికి కావలసిన మందులతో పాటు కంటి అద్దాలని కూడా ఉచితంగానే అందివ్వనున్నారు.

అత్యాధునిక పరికరాలతో కూడిన సంచార వాహనాల ద్వారా గ్రామాల వద్దకే వెళ్లి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యం. కంటి పొరలు ఉన్నట్లు గుర్తించిన రోగులకు అదే శిబిరంలో ఎటువంటి ఖర్చు లేకుండా శస్త్రచికిత్స చేసి అవసరమైన లెన్స్లు అమరుస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మధుమేహం (Diabetes) ఉన్నవారిలో వచ్చే కంటి సమస్యల (Diabetic Retinopathy) పై ప్రత్యేక అవగాహనను కూడా కల్పిస్తారు.
కాటరాక్ట్కు ఆధునిక చికిత్స!
కంటిలోని సహజసిద్ధమైన లెన్స్ (Lens) మసకబారడాన్నే 'కంటి పొర'లేదా 'కాటరాక్ట్' అంటారు. ఇది సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంది. అయితే, ఆధునిక వైద్యం ఇప్పుడు ఈ సమస్యను చాలా సులభంగా, నొప్పి లేకుండా పరిష్కరిస్తోంది. శంకర నేత్రాలయ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు కంటి వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. వీరు ఉచితంగా పేదవారికి కూడా అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు.
ఆపరేషన్ విధానాలు ....!
ప్రస్తుతం కంటి పొర చికిత్సలో ప్రధానంగా రెండు రకాల పద్ధతులు వాడుకలో ఉన్నాయి. మొదటిది ఫాకో ఎమల్సిఫికేషన్. ఇది అత్యంత ఆధునిక పద్ధతి. ఇందులో కుట్లు ఉండవు. అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా మసకబారిన పొరను కరిగించి తీసివేస్తారు. దాని స్థానంలో 'ఫోల్డబుల్ లెన్స్'ను అమరుస్తారు. ఇది చాలా చిన్న రంధ్రం ద్వారా జరుగుతుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది.
రెండవది లేజర్ కాటరాక్ట్ సర్జరీ. ఇది మరింత కచ్చితత్వంతో కూడిన పద్ధతి. బ్లేడ్ వాడకం లేకుండా లేజర్ సాయంతో ఆపరేషన్ చేస్తారు.
కంటి చూపు మనిషికి దేవుడు ఇచ్చిన అతిపెద్ద వరం. కంటి పొరలు వచ్చాయని భయపడకుండా పరీక్షలు చేయించుకుని, సకాలంలో ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ప్రపంచాన్ని స్పష్టంగా చూడవచ్చు.
గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి!
డబ్బు లేని కారణంతో ఎవరూ చూపు కోల్పోకూడదనే ఉదాత్తమైన భావంతో గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం శంకర నేత్రాలయ , శాంతా - వసంతా ట్రస్టు సంయుక్తంగా ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పేద ప్రజలకు, వృద్ధులకు ఈ సమాచారాన్ని చేరవేసి, ఉచిత సేవలని సద్వినియోగం చేసుకునేలా తోటపల్లి గూడూరు పరిసర ప్రాంత ప్రజలకి చైతన్యం కల్పించాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.