యోగి వేమన బోధనలు సమాజానికి దిక్సూచి
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:03 AM
యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశాలు, దిక్సూచిలాంటివని కలెక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు.
కర్నూలు కలెక్టరేట్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశాలు, దిక్సూచిలాంటివని కలెక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం కలెక్టర్తో పాటు జేసీ నూరుల్ ఖమర్.. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు సాహితీ వనంలో వేమన ఒక ధృవతార వంటి వారని, కేవలం కవి మాత్రమే కాకుండా గొప్ప తత్వవేత్త, సామాజిక సంస్కర్త, ప్రజాకవిగా గుర్తింపు పొందారని కొనియాడారు. సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, మూఢ నమ్మకాలు, అజ్ఞానం వంటి కుళ్లను నిర్మూలించేందుకు తన పద్యాలను ఆయుదంగా మలిచిన మహానుభావుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, సెట్కూరు సీఈవో వేణుగోపాల్, అధికారులు పాల్గొన్నారు.