రహ'దారుణాలు'
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:08 AM
మండలంలోని చిన్నకంబలూరు మెట్ట నుంచి శిరవెళ్ల వెళ్లే ఆర్అండ్బీ రహదారి గుంతలమయంగా ఉంది. సుమారు 2.2 కి.మీలు ఇలాగే ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు
రుద్రవరం మండలంలో గుంతల రహదారి..
చాగలమర్రి మండలంలో మట్టిరోడ్లు
రుద్రవరం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నకంబలూరు మెట్ట నుంచి శిరవెళ్ల వెళ్లే ఆర్అండ్బీ రహదారి గుంతలమయంగా ఉంది. సుమారు 2.2 కి.మీలు ఇలాగే ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలుమార్లు ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయపడ్డారు. అధికారులు స్పందింది, నూతన రహదారిని నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
మట్టిరోడ్లు, వాహనదారులకు తిప్పలు
చాగలమర్రి: మండలంలోని నేలంపాడు, గొట్లూరు, డి.వనిపెంట, కొత్తపల్లె, ఓజీ తండా, చింతలచెరువు, చిన్నవంగలి, పెద్దవంగలి గ్రామాలకు రహదారులు సరిగా లేక వాహనదారులు, రైతులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కలుగొట్లపల్లె నుంచి గొట్లూరు గ్రామానికి వెళ్లే రహదారి గతంలో వేసినా, నాణ్యత లేకపోవడంతో గ్రావెల్ కొట్టుకుపోయి కంకర తేలింది. అలాగే గొట్లూరు నుంచి నేలంపాడుకు వెళ్లే రహదారి తారు కొట్టుకుపోయింది. గొడిగనూరు నుంచి కొత్తపల్లె, డి.వనిపెంట, ముత్యాలపాడు, ఓజీ తండా గ్రామాలకు వెళ్లే రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. రాత్రి వేళల్లో ఆదమరిస్తే ప్రమాదాలకు గురి కావాల్సిందే. వాహనదారులు, రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. చింతలచెరువు, పెద్దవంగలి, చిన్నవంగలి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. పాలకులు, అధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.