Share News

సమన్వయంతో పని చేయండి

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:08 PM

నేర నియంత్రణ, ప్రజల భద్రత, శాంతి భదత్రల పరిరక్షణకు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆదేశించారు.

సమన్వయంతో పని చేయండి
మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణ, ప్రజల భద్రత, శాంతి భదత్రల పరిరక్షణకు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, బహిరంగంగా మద్యం సేవించడం, మట్కా, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం పెంచాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోలీస్‌ యాప్‌లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని నేరాలను అరికట్టాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలు, వార్డులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను తెలుసుకుని నేర నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఎస్పీ సూచించారు. అడిషనల్‌ ఎస్పీ ఖాదర్‌బాషా, నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ సుస్మిత, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌, ఆళ్ళగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లాలోని స్టేషన్‌ హౌస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:08 PM