నులి పురుగుల నివారణకు కృషి చేయండి
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:50 PM
నులి పురుగుల నివారణకు కృషి చేయాలని వైద్యఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ (కడప) స్టేట్ అబ్జర్వర్ డా.బి. రామగిడ్డయ్య పిలుపునిచ్చారు.
వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ డా.బి. రామగిడ్డయ్య
కర్నూలు హాస్పిటల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): నులి పురుగుల నివారణకు కృషి చేయాలని వైద్యఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ (కడప) స్టేట్ అబ్జర్వర్ డా.బి. రామగిడ్డయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో డా.ఎల్.భాస్కర్, ఆర్బీఎస్ఏ ఎన్సీడీ జిల్లా అధికారి డా. మహేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 17న జరిగే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. డీఎంహెచ్వో డా.ఎల్.భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు బాల బాలికలు 6,57,533 మంది పిల్లలు ఉన్నారని, వీరందరికి మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రలను మింగించాలన్నారు. మంగళవారం కలెక్టర్, ఆదని సబ్ కలెక్టర్, పత్తికొండ ఆర్డీవో నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమాన్నిప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ డా. విశ్వేశ్వరరెడ్డి, జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, జిల్లా మాస్ మీడియా అధికారి ఎన్.ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.