22(ఎ) జీవోను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:37 AM
22(ఎ) జీవో పేరుతో అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టిన భూములను తక్షణమే విడుదల చేయాలని, ఈ జీవోను ఉపసంహరించుకోవాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
కర్నూలు రాజ్విహార్ సర్కిల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): 22(ఎ) జీవో పేరుతో అన్యాయంగా నిషేధిత జాబితాలో పెట్టిన భూములను తక్షణమే విడుదల చేయాలని, ఈ జీవోను ఉపసంహరించుకోవాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మౌర్య ఇన్లోని పరిణయ ఫంక్షన్ హలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో భూమి హక్కుల వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం చేసే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండా వ్యవస్థలో కొన్ని లోపాలు జరిగాయని, దీని వల్ల లక్షల ఎకరాల భూములు 22(ఎ) పరిధిలోకి తీసుక వెళ్లారని ఆయన ఆరోపించారు. తరువాత వైఎస్ జగన్ హయాంలో ఈ విధానం ఏదో బాగుందన్నట్లు తనకు గిట్టని వారివి, ప్రతిపక్షాల వారి భూములను 22(ఎ) పరిధిలోకి చేరుస్తూ దుర్మార్గాలకు పాల్పడ్డరని దీని వల్ల అమాయక ప్రజలు బలి అయ్యారన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో పొరపాటు జరిగినా దానిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని, గత ప్రభుత్వ పాలనలో పొరపాటు జరిగిందని 22(ఎ) పరిధిలో ఉంచిన ఆవులపల్లిలోని 910 ఎకరాల భూములను ఒకే ఒక కాగితంతో విడుదల చేశారని, పాలకులు కళ్లు తెరిచి ఇప్పుడు కూడా అదే విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా జీవోను తీసుక రావాలని ఆయన సూచించారు. 2014 సంవత్పరంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ 22(ఎ) భూములపై జస్టిస్ నాగార్జునరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, దానిని తూచ తప్పకుండా అమలు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లమోతు చక్ర వర్తి, నాయకులు ఎన్.పి.సురే్ష, హేమలత, ఎద్దుల పుల్లయ్య పాల్గొన్నారు.