భర్తను కడతేర్చిన భార్య
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:14 AM
కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో చోటు చేసుకున్నట్లు సీఐ జయన్న తెలిపారు.
కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే కారణం
పత్తికొండ సీఐ జయన్న
పత్తికొండ టౌన్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో ఓ భార్య భర్తను కడతేర్చింది. ఈ ఘటన పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో చోటు చేసుకున్నట్లు సీఐ జయన్న తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన మేకల శ్రీని వాసులు(50) భార్య సునీత కొన్నేళ్ల పాటు సజావుగా కాపురం సాగింది. వీరికి లీలావతి, సుజాత సంతానం. ఐదారేళ్ల నుంచి భార్యాభర్తలు కుటుంబ కలహాల కారణంగా వేర్వేరు గా కాపురం ఉంటున్నారు. పెద్దకుమార్తె లీలావతికి భార్య పెళ్లి చేయగా, చిన్న కుమార్తెకు అనారోగ్యం కారణంగా తల్లి వద్దే ఉంటుంది. కొన్ని రోజులుగా అప్పులు అధికమై పొలం అమ్మే విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి వేరుగా ఉంటున్న భర్త ఇంటికి భార్య సునీత, కుమార్తెలు లీలావతి, సుజాత, అల్లుడు రాజశేఖర్ వెళ్లారు. రాడ్లు, కట్టెలతో శ్రీనివాసులుపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ జయన్నలు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యలో ప్రమేయం ఉన్న మృతుడి భార్య సునీత, కుమార్తెలు లీలావతి, సుజాతతో పాటు అల్లుడి రాజశేఖర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.