రైతుబజార్లలో రైతులకే చోటు లేదా?
ABN , Publish Date - May 01 , 2026 | 12:15 AM
ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లలో రైతులకే చోటు లేకపోతే మీరంతా చేస్తున్నారు? అని మార్కెటింగ్ శాఖ అధికారులపై కలెక్టర్ డా.ఏ. సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రైతుబజార్లలో సమస్యలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
పోలీసులతో దళారులను ఏరివేయండి
ఆగ్రహించిన కలెక్టర్ డా. ఎ. సిరి
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లలో రైతులకే చోటు లేకపోతే మీరంతా చేస్తున్నారు? అని మార్కెటింగ్ శాఖ అధికారులపై కలెక్టర్ డా.ఏ. సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రైతుబజార్లలో సమస్యలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు మార్కెట్ యార్డులో కూరగాయలను తక్కువ ధరకు కొనుగోలుచేసి వాటినే రైతుబజార్లకు తరలించి దళారులు, వ్యాపారులు, వినియోగదారులకు ఎక్కువ ధరకు అంటగడుతున్నారని, అటువంటప్పుడు దళారులకు రైతుబజార్లలో అవకాశం ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. రైతుబజార్లలో దళారులను ఏరివేసేందుకు అవసరమైతే పోలీసు సహాయం తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ, రైతుబజార్ల అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులన్నింటిలో శానిటేషన్, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మార్కెట్ కమిటీల సెక్రటరీలను ఆదేశించారు. కర్నూలు మార్కెట్ యార్డులో కూరగాయల మార్కెట్ యార్డులో ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.
రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునే సమయంలో చెత్తాచెదారం నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు వల్ల వారు అనారోగ్యానికి గురవుతున్నారని, వెంటనే యార్డును పరిశుభ్రంగా ఉంచాలని మార్కెట్ యార్డుల సెక్రటరీలను ఆదేశించారు. మార్కెట్ యార్డులలో, రైతుబజార్లలో రైతులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత మిగిలిన వారికి అవకాశం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, సీ. క్యాంపు రైతుబజార్ ఎస్టేట్ అధికారి కళ్యాణి, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరుతో పాటు కర్నూలు నగరంలోని కొత్తపేట, అమీన్ అబ్బా్సనగర్ ఎస్టేట్ అధికారులు జయలక్ష్మి, హరీష్, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.