సంక్షేమం, అభివృద్ధే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:47 PM
అభివృద్ధి, సంక్షేమం కూటమి లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు అర్బన్, జూలై 13(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం కూటమి లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలో మురికి నీరు ట్రీట్మెంట్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి పైలాన్ను ఆవిస్కరించారు. కర్నూలు నగరం నుంచి వచ్చే మురికి నీటి ని శుభ్ర పరిచే ప్రక్రియ కోసం రూ. 150 కోట్లు, అమృత్ 2.0 పథకం కింద 35 ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని, ఈ ప్లాంట్ ను 18 నెలల్లోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కూడా మురికి నీరు నదుల్లో కలువ కూడదని, నదీ జలాలు కలుషితం కారాదని అందుకు కావాల్సిన కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కర్నూలు నగరంలో గత కృష్ణాపుష్క రాల సమయంలో మురికి నీరు నదిలో కలుస్తూ ఉండడంతో పుష్కర యాత్రికులు సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధిక నిధులు రాబట్టి అభివృద్ధి చేస్తున్నామని, కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు అన్ని విషయాల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. హజ్ కమిటీ డైరెక్టర్ సూరి మన్సూర్ ఆలీ ఖాన్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, హెల్త్ ఆఫీసర్ డా. రఘు, రామ్మెహన్ యాదవ్, ఎస్ఈ గుర్రప్ప యాదవ్, ఇంజనీర్లు పాల్గొన్నారు.