ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే సహించం
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:52 PM
నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ ఆదాయాలకు గండికొడితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ హెచ్చరించారు.
రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ ఆదాయాలకు గండికొడితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ హెచ్చరించారు. పట్టణంలోని మార్కెట్ యార్డుకు సంబంధించిన దుకాణాల్లో కొనసాగుతున్న శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా మహిళా సహకార బ్యాంక్, నంది రైతు సమాఖ్య దుకాణాలను సోమవారం మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబుతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. కాలపరిమితి ముగిసినప్పటికీ నేటికీ దుకాణాలను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీ చేసి మార్కెట్ కమిటీకి అప్పజెప్పాలన్నారు. గతంలో దుకాణానికి రూ.2500 చొప్పున కేటాయించుకొని నేటికీ అదే ధర చెల్లించడం అన్యాయమన్నారు. బయట మార్కెట్లో ఒక్కో దుకాణానికి నెలకు దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు మార్కెట్ యార్డు దుకాణాల నుంచి వచ్చే ఆదాయాన్ని పొల్చితే చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు త్వరలో దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలం ఒకరిపై పాడి మరొకరు దుకాణాలు కొనసాగిస్తూ టీడీపీ నాయకులను విమర్శించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రంగప్రసాద్, డైరెక్టర్లు పాల్గొన్నారు.