విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - May 25 , 2026 | 10:57 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 129 ఫిర్యాదులు
కర్నూలు క్రైం, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం కొత్తపేటలోని టూటౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 129 పిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో మహళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు రామయ్య నాయుడు, రామకృష్ణ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని
నా కోడలికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.4లక్షలు తీసుకుని మోసం చేసిన సి.బెళగల్కు చెందిన ఎర్రన్నపై చర్యలు తీసుకోవాలని క్రిష్ణగిరి మండలం, ఆగవేలి గ్రామంకు చెందిన కె.లింగన్న ఫిర్యాదు చేశారు.
30 ఏళ్లుగా జీవనోపాధిగా ఉన్న నా కూరగాయల బంకును ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన రాములమ్మ ఫిర్యాదు చేశారు.
బ్రాహ్మణకొట్కూరుకు చెందిన గొల్ల నాగశేషులు ట్రాక్టర్ అద్దెకు తీసుకుని, అద్దె చెల్లిస్తామని చెప్పి 4నెలల పాటు నెలకు రూ.20వేలు చెల్లించారు. ట్రాక్టర్ను తిరిగి ఇవ్వకుండా ట్రాక్టర్తో పాటు కనిపించకుండా ఎక్కడికో పరారయ్యారు. అతడిపై చర్యల ుతీసుకోవాలని కర్నూలు మారుతినగర్ చెందిన రామాంజనేయులు పిర్యాదు చేశారు.
ఇల్లు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు వన్టౌన్ గడ్డ వీధికి చెందిన షేక్ మైమూన్ ఫిర్యాదు చేశారు.
నా తమ్ముడు మునిస్వామి నాకు తెలియకుండా రెండెకరాల పొలం, ఇల్లు అమ్ముకుని మోసం చేశాడని ఆలూరు మండలం, మొలగవెల్లి గ్రామానికి చెంఇన వెంకటలక్ష్మి ఫిర్యాదు చేశారు.