సారా రహిత జిల్లా లక్ష్యంగా పని చేయాలి
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:30 PM
నాటు సారా రహిత జిల్లా లక్ష్యంగా పని చేయాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటి కమిషనర్ పి.శ్రీదేవి పిలుపునిచ్చారు.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి
ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష
కర్నూలు అర్బన్, జూలై 7(ఆంధ్రజ్యోతి): నాటు సారా రహిత జిల్లా లక్ష్యంగా పని చేయాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటి కమిషనర్ పి.శ్రీదేవి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలులోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ వి.హనుమంతరావుతో కలిసి ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల సూపరింటెండెంట్లు, సీఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ నాటు సారా తయారీదారులకు బెల్లం అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై నిఘా ఉంచి వారందరిని బైండోవర్ చేయాలన్నారు. తరిగి నాటు సారా తయారు చేయడానికి ప్రయత్నిస్తున వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. నాటు సారా మానేసిన వారికి ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కల్పించాలని ఆదేశించారు. పొరుగు, ఇతర రాష్ట్రాల మద్యం జిల్లాలోని ప్రవేశించకుండా, నిరంతరం నిఘా ఉంచి దాడులు చేయాలని ఆదేశించారు. పాత కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జీషీట్లు వేయాలని, పెండింగ్ కేసుల్లో ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. గంజాయి పెంపకం, ఇతర నార్కోటిక్ డ్రగ్స్ సరఫరా నివారణకు పటిష్ట నిఘా ఉంచి దాడులు చేయాలన్నారు. మద్యం దుకాణాల రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ను పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, గడువు తేది తర్వాత చెల్లించిన వారినుంచి జరిమాన వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సూపరింటెండెంట్లు ఎం.సుధీర్బాబు, రవికు మార్, ఏఈఎస్ రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.