కేసీ కెనాల్కు నీరు బంద్
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:45 PM
కేసీ కెనాల్కు నీటి పంపింగ్ ను అధికారులు బంద్ చేశారు.
హంద్రీ నీవాకు 9 పంపుల ద్వారా 3,050 క్యూసెక్కులు
నందికొట్కూరు రూరల్, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్కు నీటి పంపింగ్ ను అధికారులు బంద్ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని గ్రామాలకు పట్టణానికి తాగునీటి అవసరాల కోసం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లను నింపడం కోసం కేసీ కెనాల్కు మల్యాల ఎత్తిపోతల నుండి ఒక పంప్ ద్వారా 350 క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీరు విడుదల చేసి బంద్ చేశారు. కేసీ కెనాల్ ఏఈ నాయక్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చొరవతో తాగునీటి కోసం నీరు విడుదల చేసి, ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంద్ చేశారని తెలిపారు.
హంద్రీ నీవాకు 9 పంపులతో..
మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీ నీవా కాలువకు 9 పంపుల ద్వారా 3,050 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హంద్రీ నీవా ఈఈ ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి దాకా మల్యాల ఎత్తిపోతల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని హంద్రీ నీవా కాలువకు దాదాపుగా 3.60 టీఎంసీల నీరు విడుదల చేశామన్నారు. ఈ నీరు మల్యాల ఎత్తిపోతల నుండి 216 కిలో మీటర్ల దూరంలో వున్న అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయానికి చేరుకుని ఆ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండి పోయిందన్నారు. అనంతపురం జిల్లాలోని కాలువలు, రిజర్వాయర్లను ఈ నీటితో నింపుతారని తెలిపారు.