పాలేరు వాగులో తగ్గిన ప్రవాహం
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:56 AM
మండలంలో పది గ్రామాలకు సాగు, తాగునీరు అందంచే పాలేరు వాగులో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రశ్నార్థకంగా పది గ్రామాలకు సాగు, తాగునీరు
సంజామల, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలో పది గ్రామాలకు సాగు, తాగునీరు అందంచే పాలేరు వాగులో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ లోనే ప్రవాహం తగ్గడం ఇదే మొదటిసారని వాపోతున్నారు. ఎగువన ఉన్న అవుకు రిజర్వాయర్ నుంచి వృథా జలాలు గొల్లలేరు డ్రైన్ ద్వారా వాగులో చేరుతాయి. రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడంతో వాగుకు నీరు రావడం లేదు. మండలంలోని వసంతపురం, కమలపురి, ఓత్రమాన్దిన్నె, బొందలదిన్నె, ముదిగేడు, ముక్కమల్ల, ముచ్చలపురి, ఎగ్గోని, కొత్తపేట, సంజామల మీదుగా వాగు ప్రవహిస్తుంది. ఈ గ్రామాలల్లో పది మంచినీటి పథకాలు కొనసాగుతున్నాయి. 4వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మినుము, మిరప, తదితర పంటలను సాగు చేస్తారు. ప్రస్తుతం వరి పంట, మొక్కజొన్న పంటలు 70శాతం కోతకు వచ్చాయి. మిగిలిన 30శాతం పంటలకు మరో మూడుతళ్లు నీరు అవసం. అయితే ప్రవాహం తగ్గడంతో ఏంచేయాలో తెలియడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జలవనరుల అధికారులు స్పందించి పది గ్రామాలకు సాగు, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని పరివాహక రైతులు, ప్రజలు కోరుతున్నారు.