రహదారి పక్కనే రాళ్ల కుప్పలు.. వాహనదారులకు తిప్పలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:40 AM
మండలంలోని ప్రధాన రహదారుల పక్కనే నాపరాళ్ల వ్యర్థాలు పడేస్తుండటంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. కొలిమిగుండ్లలో భారీగా నాపరాతి పరిశ్రమలు ఉన్నాయి.
కొలిమిగుండ్ల మండలంలోని ప్రధాన ఆర్అండ్బీ రహదారుల పక్కనే నాపరాళ్ల వ్యర్థాలు
పట్టించుకోని అధికారులు
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రధాన రహదారుల పక్కనే నాపరాళ్ల వ్యర్థాలు పడేస్తుండటంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. కొలిమిగుండ్లలో భారీగా నాపరాతి పరిశ్రమలు ఉన్నాయి. వాటి యజమానులు రాళ్ల వ్యర్థాలను ఇష్టారాజ్యంగా రహదారుల పక్కనే పడేసి వెళ్లిపోతున్నారు. బెలుం-కోవెలకుంట్ల రహదారి, అంకిరెడ్డిపల్లె-చింతలాయపల్లె, బందార్లపల్లె-తాడిపత్రి, మీర్జాపురం-బెలుం శింగవరం రహదారుల ఇరువైపులా రాళ్ల కుప్పలతో పూడ్చేస్తున్నారు.
బోర్డులు పెట్టి వదిలేసిన అధికారులు
నాపరాళ్ల వ్యర్థాలను రహదారి ఇరువైపులా 45 మీటర్ల వరకు వేయవద్దని, మైనింగ్ చేయరాదంటూ ఆర్అండ్బీ అధికారులు కేవలం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వేస్టేజితో రోడ్డు విస్తార్ణం కుచించుకపోతున్నా అధికారులు పట్టించుకోవడం వాహనదారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడి వేస్టేజీని తరలించి, ఇకపై ఎవరూ వేయకుండా చూడాలని కోరుతున్నారు.