వినాయకా.. సెలవిక
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:26 PM
స్వామీ.. వెళ్లి రావయ్యా అంటూ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా వినాయక నిమజ్జనం
బాణసంచా, డీజేలతో హోరెత్తిన ఆదోని
సందడి చేసిన భక్తులు
నిమజ్జనాన్ని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఆదోని/ అగ్రికల్చర్/ రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): స్వామీ.. వెళ్లి రావయ్యా అంటూ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఆదోని పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా, భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా ముగిసింది. డప్పు, వాయిద్యాలతో గణనాథులను ఊరేగిస్తూ రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఆదోనిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొని గంగ మ్మకు ప్రత్యేక పూజలు చేశారు. హరివాణం సమీపంలోని ఎల్లెల్సీ కెనాల్లో వినాయకులను గంగఒడికి చేర్చారు. విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మొదటి వినాయక మండపం నుంచే నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మండపంలో నిర్వహించిన లడ్డు వేలంపాట ఉత్కంఠ భరితంగా సాగింది. టీడీపీ సీనియర్ నేత బసాపురం రామస్వామి రూ.3.65లక్షలకు లడ్డూను దక్కిం చుకున్నారు. నిమజ్జనాన్ని ఎస్పీ విక్రాంత్పాటిల్, డీఎస్పీ వెంకటరమణ, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు నల్లప్ప, చంద్రశేఖర్, రాజశేఖర్రెడ్డి, రామలింగయ్య, గౌస్తో కలిసి పరిశీలించారు. భక్తుల కోసం అన్నదానాలు నిర్వహించారు.