అకాల వర్షం.. అపార నష్టం
ABN , Publish Date - May 25 , 2026 | 12:26 AM
మండలంలోని జుమాలదిన్నె గ్రామంలో శనివారం కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటి ల్లింది. ఈదురుగాలుల ధాటికి గ్రామంలో సుమారు 50కి పైగా విద్యుత్ స్తంభాలు, 6 భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. వీటితో పాటు 33కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ కిట్ కూడా దెబ్బతిం దని మండల విద్యుత్ శాఖ ఏఈ వీరేష్ తెలిపారు.
జుమాలదిన్నెలో నేలకొరిగిన 50 విద్యుత్ స్తంభాలు, 6 ట్రాన్స్ఫార్మర్లు
యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
కోసిగి, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని జుమాలదిన్నె గ్రామంలో శనివారం కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటి ల్లింది. ఈదురుగాలుల ధాటికి గ్రామంలో సుమారు 50కి పైగా విద్యుత్ స్తంభాలు, 6 భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. వీటితో పాటు 33కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ కిట్ కూడా దెబ్బతిం దని మండల విద్యుత్ శాఖ ఏఈ వీరేష్ తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు
విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో జుమాలదిన్నె గ్రామంలో అంధకారం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఏఈ వీరేష్ తన సిబ్బందితో కలిసి దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
మంత్రాలయంలో గాలివాన బీభత్సం
మంత్రాలయం: మండలంలోని మాధవరం, చెట్నహళ్లి, సూగూరు, బూదూరు, వగరూరు, తిమ్మాపురం, మాల పల్లి, రచ్చమర్రి గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి ఉరుములు, గాలి, వానతో మూడుగంటలతో పాటు ఏకధాటిగా గాలి వాన కురిసింది. ఎండవేడిమి, ఉక్కపోతతో ఉన్న వాతావరణం చల్లబడింది. అయితే చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిగ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, వైర్లు తెగిపోవడంతో అంధకారం నెలకొంది. ఆదివారం విద్యుత్ అధికారులు మరమ్మతులు చేసి విద్యుత్ను పునరుద్ధరించారు.
నేలకూలిన చెట్లు విద్యుత్ స్తంభాలు
పెద్దకడబూరు: మండల కేంద్రంలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఎస్సీ కాలనీలో రాజు ఇంటి దగ్గరలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగి ఇంటిపై నేలకూలింది. విద్యుత్ సరఫరా జరిగి ఉంటే తమ పరిస్ధితి ఏమిటిని బాధితుడు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించామని, ప్రాణాలు పోతే తప్ప పట్టించుకోరా అని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ స్తంభాన్ని తొలగించి వేరొకచోట ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను కాలనీ వాసులు కోరారు.
విద్యుత్ శాఖకు భారీ నష్టం
కౌతాళం: మండలంలో శనివారం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ శాఖకు భారీగా ఆస్తి నష్టం కలిగింది. ముఖ్యంగా మండలంలోని బంటకుంట, చిరుతాపల్లి, మల్లనహట్టి గ్రామాల్లో దాదాపు 50 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని మండల ఏఈ నరసన్న తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ శాఖ దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేపట్టారు. పూర్తిగా విరిగిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని చోట్ల పనులు ముగిస్తామన్నారు.