Share News

రేపు ‘రెండేళ్ల సంబరం’

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:44 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాన్ని 17వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

రేపు ‘రెండేళ్ల సంబరం’
మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాన్ని 17వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. టెక్కె మార్కెట్‌ యార్డులో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు మంత్రులు బీసీ జనార్ధన్‌ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను ప్రతిబింబించేలా ఉండాలన్నారు. మొత్తం 19 శాఖల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలో యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్‌లో ఉన్న అన్ని కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

పీజీఆర్‌ఎల్‌లో 408 అర్జీలు

ప్రజల పక్షాన నిలిచి వారు ఇచ్చిన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 408 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌ ద్వారా 242 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, విచారణ నిర్వహించాలన్నారు. అనంతరం సరైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. కార్యాలయాల కార్యకలాపాలన్నీ ఈ-తపాల్‌ ద్వారానే జరగాలన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:44 PM