ఇంధన కొరతకు కారణం ట్రంప్
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:53 PM
దేశంలో ప్రజలు గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారంటే అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు.
జగన్మోహన్రెడ్డి హత్య దారుణం
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రజలు గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారంటే అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. బుధవారం కర్నూలు నగరంలోని సీఆర్ భవన్లో ఆయన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె. రామాంజనేయులుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా దేశాల సంపద దోచుకునేందుకే ట్రంప్ యుద్ధం చేస్తున్నాడన్నారు. ట్రంప్ భారత్ను అవమానిస్టుంటే ప్రధాని నరేంద్రమోదీ నోరు మెదపకపోవడం దుర్మార్గమ న్నారు. ఇరాన్ దేశంలోని పెట్రోలు, డీజిల్ లాంటి సంపదనను దోచుకోవడానికి ట్రంప్ ఆయా దేశాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానని ట్రంప్ 62 సార్లు చెబితే దీన్ని మోదీ దీన్ని ఖండించలేదన్నారు. నరేంద్రమోదీ దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీకి చెందిన 7మంది రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకోవడం దారుణమని అన్నారు. బీజేపీవాళ్లు చదువు రాని గూండాలని విమర్శలు చేసిన ఎంపీ రాఘవ్ చద్దాను నేడు బీజేపీలోకి చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇంత జరగుతున్నా సీనియర్ రాజకీయ వే త్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏమాత్రం నోరెత్తడం లేదన్నారు. చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్రెడ్డి హత్య దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమాలపై వార్తలు రాస్తే దాడులు, హత్యలు చేయడం దుర్మార్గమని, వెంటనే ప్రభుత్వం దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మునెప్ప, ఎన్.లెనిన్బాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం పాల్గొన్నారు.