చాగలమర్రిలో కుండపోత
ABN , Publish Date - Jun 19 , 2026 | 11:59 PM
మండలంలో ఉరుములు, మెరుపులతో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది.
22.3 మి.మీ వర్షపాతం నమోదు
ప్రాణం పోసుకున్న వర్షం
చెక్ డ్యామ్లకు జలకళ
చాగలమర్రి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉరుములు, మెరుపులతో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. 22.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారి అబ్దుల్సత్తార్ తెలిపారు. ఈ వర్షంతో ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పాఠశాలల ప్రాంగణాలు జలమయమయ్యాయి. మద్దూరు, పెద్దబోదనం గ్రామాల సమీపంలో గల చెక్ డ్యామ్లలో వర్షపు నీరు నిలిచి జలకళ సంతరించుకుంది. వాగులు, వంకల్లో వర్షపునీరు ప్రవహించింది. బోర్ల కింద సాగు చేసిన మొక్కజొన్న, వేరుశనగ, మినుము పంటలకు వర్షం జీవం పోసింది. వారం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం కురవడంతో రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
భారీ వర్షం
ప్రవహిస్తున్న వాగులు, వంకలు
రుద్రవరం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : రుద్రవరం మండలం నక్కలదిన్నె, ముత్తలూరు, నల్లవాగుపల్లె, నరసాపురం, మందలూరు, చందలూరు గ్రామాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. నక్కలదిన్నెలో వీధులన్నీ జలమయం అయ్యాయి. నల్లవాగుపల్లె గ్రామ సమీపంలోని నల్లవాగు, ముత్తలూరు సమీపంలోని వాగులో వర్షం నీరు గలగలా పారింది. నరసాపురంలో వర్షం నీరు నిలిచింది. ఉన్నత పాఠశాల ఆవరణలో వర్షం నీరు నిలిచిపోయింది. విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.